ఎట్టకేలకు మోక్షం!

ABN , First Publish Date - 2021-02-24T06:45:00+05:30 IST

(కాకినాడ, ఆంధ్రజ్యోతి) జిల్లాలోని తొండంగి మండలం కోన గ్రామంలో జలరవాణా ద్వారా ఎగుమతి, దిగుమతి కార్యకలాపాలకు మారిటైం బోర్డు సీఈవో కార్యాలయాన్ని ఏర్పాటు చేయడా

ఎట్టకేలకు మోక్షం!

మారిటైం బోర్డుకు భూములిచ్చిన వారికి 

ఎకరాకు రూ.25 లక్షల పరిహారం

టిడ్కో ఫ్లాట్లకు సొమ్ము చెల్లించిన లబ్ధిదారులకు 

కేటగిరీల వారీగా సగం సొమ్ము వెనక్కి

కాకినాడ సెజ్‌లో 2,180 ఎకరాల 

అవార్డు భూములు బాధిత రైతులకే

కేబినెట్‌ సమావేశంలో కీలక నిర్ణయాలక ఆమోదం


(కాకినాడ, ఆంధ్రజ్యోతి)

జిల్లాలోని తొండంగి మండలం కోన గ్రామంలో జలరవాణా ద్వారా ఎగుమతి, దిగుమతి కార్యకలాపాలకు మారిటైం బోర్డు సీఈవో కార్యాలయాన్ని ఏర్పాటు చేయడానికి గత ప్రభుత్వం ప్రతిపాదించింది. ఈ మేరకు అప్పట్లో ఈ గ్రామంలో 165.34 ఎకరాల భూమిని సేకరించి నిర్మాణ పనులకు నిర్ణయం తీసుకుంది. అయితే భూములిచ్చిన వారికి నష్టపరిహారం విషయంలో అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. అప్పటి పోర్టు డైరెక్టర్‌ కె.ప్రవీణ్‌, జేసీ సంయుక్త ఆధ్వర్యంలో బోర్డు ఏర్పాటుకు స్థానికంగా ప్రజలతో సమవేశం నిర్వహించారు. కాలుష్యరహితంగా ఏర్పాటు చేస్తే తమకు ఎటువంటి అభ్యంతరం లేదని తీర్మానం ఆమోదంతో బోర్డు నిర్మాణానికి ఏకాభిప్రాయం వచ్చింది. కానీ భూములు కోల్పోయిన వారు ఎకరాకు రూ.30 లక్షలు డిమాండ్‌ చేయడంతో, అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇక్కడ బోర్డు నిర్మాణ పనులు నిలిచిపోయాయి. ఎట్టకేలకు మంగళవారం అమరాతిలో నిర్వహించిన కేబినేట్‌ సమావేశంలో ఈ అంశం కొలిక్కి వచ్చింది. ఎకరాకు రూ.25లక్షల చొప్పున భూములిచ్చిన వారికి ఇవ్వడానికి అంగీకారం కుదిరింది. దీంతో జిల్లాలో విశాల తీరం కలిగిన ప్రాంతంలో మారిటైం బోర్డు ఏర్పాటుకు మార్గం సుగమం అయ్యింది. ఈ నేపథ్యంలో కాకినాడ కేంద్రంగా ఇక్కడ ఉన్న రెండు పోర్టుల ద్వారా జలరవాణాతో ఎగుమతి, దిగుమతులు పెరగనున్నాయి. 

టీడీపీ ప్రభుత్వ హయాంలో నిరుపేద లబ్ధిదారులకు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కాకినాడ, రాజమహేంద్రవరం, మండపేట, సామర్లకోట, తుని, అమలాపురం ప్రాం తాల్లో ఏపీ టిడ్కో పేరిట ఫ్లాట్ల నిర్మాణం చేపట్టారు. దాదాపు అన్నిచోట్లా గృహప్రవేశాలకు సిద్ధం చేసిన క్రమంలో అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం ఎంపికైన వారికి ఫ్లాట్ల కేటాయింపు నిలిపివేసింది. దీంతో లబ్ధిదారులు తాము చెల్లించిన నగదు తిరిగి ఇచ్చేయాలని మునిసిపాలిటీ, నగరపాలక సంస్థల్లో అర్జీలు దాఖలు చేశారు. కానీ అధికారులకు దీనిపై ఎటువంటి అధికారిక సమాచారం లేకపోవడంతో ఎటూ నిర్ణయం తీసుకోకుండా ఇంతకాలం కాలయాపన చేస్తూ వచ్చారు. తమ ప్రభుత్వ హయాంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన సదరు ఇళ్లను లబ్ధిదారులకు ఎందుకు ఇవ్వరంటూ జిల్లావ్యాప్తంగా టీడీపీ ఆధ్వర్యంలో నిరసనజ్వాలలు ఎగిసిపడడంతో వైసీపీ ప్రభుత్వం ఉక్కిరిబిక్కిరయ్యింది. అయినప్పటికీ మేకపోతు గాంభీర్యంతో పంపిణీ చేయకుండా ఇంతకాలం ప్రతిపాదనను తుంగలోకి తొక్కింది. లబ్ధిదారుల నుంచి తీవ్ర ఆందోళన వ్యక్తమైన క్రమంలో ఇళ్లు పంపిణీ చేయడానికి తలొగ్గక తప్పలేదు. దీంతో కేబినేట్‌లో చర్చించిన అనంతరం ఇళ్ల పంపిణీకి అంగీకరించింది. ఈ నేపథ్యంలో 300 చదరపు అడుగుల స్థలంలో నిర్మాణమైన సింగిల్‌ బెడ్‌ రూమ్‌కు లబ్ధిదారులు చెల్లించిన రూ.లక్ష తిరిగి ఇవ్వడానికి ప్రభుత్వం ఆమోదం తెలిపింది. అయితే వారు కేటాయించిన ఫ్లాట్‌లకు ఒక రూపాయితో రిజిస్ట్రేషన్‌ చేయనున్నారు. 360 చదరపు అడుగుల్లో నిర్మించిన ఫ్లాట్‌కు లబ్ధిదారులు చెల్లించిన రూ.50వేలలో సగం తిరిగి చెల్లిస్తారు. 430 చదరపు అడుగుల స్థలంలో నిర్మించిన ఫ్లాట్‌కు చెల్లించిన రూ.25 వేల నగదులో సగాన్ని వెనక్కు ఇవ్వడానికి కేబినెట్‌ ఆమోదించింది. అయితే నిర్మాణ ఖర్చులో లబ్ధిదారులకు ఇచ్చే సబ్సిడీ పోను మిగిలిన మొత్తాన్ని ఆయా జాతీయ బ్యాంకుల నుంచి ప్రభుత్వమే లబ్ధిదారులకు నేరుగా రుణం ఇప్పించనుంది.


బాధిత రైతులకే సెజ్‌ భూములు 

కొత్తపల్లి/తుని: కాకినాడ సెజ్‌కు కొత్తపల్లి, తొండంగి మండలాల్లోని రైతులకు చెందిన 8,300 ఎకరాల భూములను కేటాయించారు. ఇందులో అవార్డు పాసైన 2,180 ఎకరాలను త్రిసభ్య కమిటీ తీర్మానం మేరకు రైతులకు తిరిగి ఇచ్చేయాలని కేబినెట్‌లో తీర్మానించారు. భూములను మినహాయించిన గ్రామాలు ఇవే. శ్రీరాంపురం, ముమ్మిడివారిపోడు, బండిపేట, పాటివారిపాకలు, రామరాఘవపురం (కొంత గ్రామం), రావివారిపోడు. కాగా తమ భూములను కూడా వెనక్కి ఇవ్వాలని తొండంగి మండలం ఏవీ నగరం, పెరుమాళ్లపురం, కోదాడ పంచాయతీల పరిధిలోని రైతులు డిమాండ్‌ చేస్తున్నారు. సేకరించిన భూముల్లో కొన్నింటిని ఇప్పటికే పోర్టుకు, దివీస్‌ పరిశ్రమకు కేటాయించారు. పూర్తి   స్థాయిలో భూ వినియోగం జరగకపోవడం వల్ల ప్రభుత్వం స్పందించి తమను కూడా ఆదుకోవాలని కోరుతున్నారు. 

Updated Date - 2021-02-24T06:45:00+05:30 IST