AP DGP ఆఫీస్ ముట్టడికి తెలుగు మహిళల యత్నం... ఉద్రిక్తత
ABN , First Publish Date - 2022-06-27T20:18:03+05:30 IST
డీజీపీ ఆఫీస్ దగ్గర ఉద్రిక్తత చోటు చేసుకుంది. వైసీపీ నేత చంగల వెంకట్రావు వ్యాఖ్యలను నిరసనగా తెలుగు మహిళలు ఆందోళనకు దిగారు.
అమరావతి: డీజీపీ(DGP) ఆఫీస్ దగ్గర ఉద్రిక్తత చోటు చేసుకుంది. టీడీపీ నేత వంగలపూడి అనిత(Vangalapudi anita)పై వైసీపీ నేత చంగల వెంకట్రావు (Changala Venkatrao) వ్యాఖ్యలకు నిరసనగా తెలుగు మహిళలు ఆందోళనకు దిగారు. వెంకట్రావుపై చర్యలు తీసుకోవాలంటూ డీజీపీ ఆఫీస్ ముట్టడికి తెలుగు మహిళలు యత్నించారు. దీంతో పోలీసులు వారిని అడ్డుకున్నారు. బారికేడ్లు అడ్డుపెట్టి సర్వీస్ రోడ్డును పోలీసులు దిగ్భంధనం చేశారు. బారికేడ్లు వద్ద తోపులాట, వాగ్వాదం చోటు చేసుకుంది. ఫిర్యాదు చేసేందుకు ఐదుగురు ప్రతినిధులను పోలీసులు డీజీపీ కార్యాలయంలోకి అనుమతించారు. మాజీ ఎమ్మెల్యే చoగల వెంకటారావు, వైసీపీ మహిళా నేత రోజారాణిపై డీజీపీ కార్యాలయంలో తెలుగు మహిళలు ఫిర్యాదు చేశారు.
గుంటూరు జిల్లా తెలుగు మహిళ అధ్యక్షురాలు అన్నాబత్తుని జయలక్ష్మి మాట్లాడుతూ...అనితపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అనితకు వైసీపీ నేతలు బహిరంగ క్షమాపణ చెప్పాలన్నారు.
విజయవాడ కార్పొరేటర్ చెన్నుపాటి ఉషారాణి మాట్లాడుతూ... మహిళలు నుంచి ఫిర్యాదు తీసుకునేందుకే ప్రభుత్వం భయపడుతోందన్నారు. మహిళల్ని అవమానించటమే ఈ ప్రభుత్వ ధ్యేయంగా కనిపిస్తోందని మండిపడ్డారు. పోలీసు బెదిరింపులకు భయపడమని, వైసీపీ నేతల తీరు ఇలానే కొనసాగితే రాష్ట్ర వ్యాప్తంగా రోడ్డెక్కుతామని తెలుగు మహిళ అధికార ప్రతినిధి కంభంపాటి శిరీష స్పష్టం చేశారు.