ఏపీలో కొత్త పీఆర్‌సీ ప్రకారమే వేతనాలు.. మరో మెమో జారీ

ABN , First Publish Date - 2022-01-26T00:19:20+05:30 IST

ప్రభుత్వ ఉద్యోగులకు కొత్త పీఆర్‌సీ ప్రకారమే వేతనాలు చెల్లించాలని ఆర్థిక శాఖ నిర్ణయించింది. పాత జీతాలే ఇవ్వాలంటూ..

ఏపీలో కొత్త పీఆర్‌సీ ప్రకారమే వేతనాలు.. మరో మెమో జారీ

అమరావతి: ప్రభుత్వ ఉద్యోగులకు కొత్త పీఆర్‌సీ ప్రకారమే వేతనాలు చెల్లించాలని ఆర్థిక శాఖ నిర్ణయించింది. పాత జీతాలే ఇవ్వాలంటూ ఉద్యోగ సంఘాలు డిమాండ్‌ చేస్తున్న సమయంలో అందుకు విరుద్ధంగా ఆర్థిక శాఖ మరో మెమోను జారీ చేసింది. ఏపీ సచివాలయం, హెచ్‌వోడీలు, ట్రెజరీలు, అకౌంట్స్‌ అండ్‌ పే, డీడీవోలకు ఆర్ధికశాఖ మెమో జారీ చేసింది. 2022 జనవరి శాలరీని ఉద్యోగులకు సంబంధించిన డీడీవోల ద్వారా రివైజిడ్ పే స్కేల్‌ 2022ను అనుసరించి చెల్లించాలని ఆదేశించింది. జనవరి 2022 రివైజిడ్‌ కంసాలిడేటెడ్‌ పెన్షన్‌, బెనిఫిట్‌లను డీడీవోల ద్వారా చెల్లించాలని సూచించింది. 


ప్రభుత్వశాఖల్లో, యూనివర్సిటీల్లో, సొసైటీల్లో, మోడల్‌ స్కూళ్లలో పనిచేస్తున్న కాంట్రాక్ట్‌ ఉద్యోగులకు మినిమం టైం స్కేల్‌ ప్రకారం జనవరి 2022 జీతాన్ని ఫిబ్రవరిలో డీడీవోల నుంచి చెల్లించాలని ఆర్థిక శాఖ జారీ చేసిన మెమోలో పేర్కొంది. ప్రభుత్వశాఖల్లో పని చేస్తున్న పొరుగుసేవల ఉద్యోగులకు జనవరి 2022 జీతాన్ని ఫిబ్రవరి 2022న డీడీవోల ద్వారా చెల్లించాలని చెప్పింది. ప్రభుత్వ ఉద్యోగుల పే బిల్లులు ప్రస్తుతం ఉన్న విధానం ప్రకారం payroll.herb.apcfss.in ద్వారా ప్రభుత్వం సూచించిన నిబంధనలు మేరకు ఎలాంటి డీవియేషన్‌ లేకుండా చెల్లించాలని స్పష్టం చేసింది. మిగిలిన కేటగిరి ఉద్యోగులు అందరికీ సీఎఫ్‌ఎమ్‌ఎస్‌, ఆప్‌కోస్‌ ద్వారా రివైజిడ్‌ పే స్కేల్స్‌ను పీఆర్‌సీ జీవో ప్రకారం అందించాలని ఆర్థిక శాఖ అదేశించింది. ట్రెజరీ ఆఫీసుల్లోని డిస్బర్సింగ్‌ ఆఫీసర్లు ఈ సూచనలు పాటిస్తూ జీతాలు చెల్లింపు ప్రక్రియ చేపట్టాలని ప్రభుత్వ చీఫ్‌ సెక్రటరీ ఎస్‌.ఎస్‌.రావత్‌ ఉత్తర్వులు జారీ చేశారు. 

Updated Date - 2022-01-26T00:19:20+05:30 IST