మరో ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్కు ఏపీ సర్కార్ మంగళం
ABN , First Publish Date - 2022-07-02T17:12:07+05:30 IST
రాష్ట్ర రాజధానిలో మరో ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ హ్యాపీ నెస్ట్కు ఏపీ సర్కార్ మంగళం పాడింది.
అమరావతి: రాష్ట్ర రాజధానిలో మరో ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ హ్యాపీ నెస్ట్ (Happy nest)కు ఏపీ సర్కార్ (AP government) మంగళం పాడింది. హ్యాపీనెస్ట్ ప్రాజెక్ట్ పేరుతో రాజధానిలోని కీలక ప్రాంతాలో ఫ్లాట్ల నిర్మాణానికి ఆన్లైన్లో ఏపీ జనం ఎగబడిన విషయం తెలిసిందే. టీడీపీ (TDP) అధినేత చంద్రబాబు నాయుడు (Chandrababu naidu) హయాంలో ఈ ప్రాజెక్ట్లో ఫ్లాట్ల కొనుగోలుకు అప్పట్లో భారీగా డిమాండ్ ఏర్పడింది. ఎన్ఆర్ఐ (NRI)లు, ఏపీ వాసుల నుంచి వెల్లువెత్తిన డిమాండ్తో మరిన్ని కొత్త ప్రాజెక్ట్లకు కూడా అప్పట్లో నిర్ణయం తీసుకున్నారు. కాగా వైసీపీ ప్రభుత్వం (YCP government) వచ్చిన తరువాత హ్యాపీ నెస్ట్ ప్రాజెక్ట్ను అధికారులు పక్కన పడేశారు. రివర్స్ టెండరింగ్ పేరుతో ప్రాజెక్ట్కు పంగనామాలు పెట్టారు. అపార్ట్మెంట్లను లాటరీలో దక్కించుకున్న వారు కట్టిన డిపాజిట్ను వెనక్కి తీసుకోవచ్చని సీఆర్డీఏ కమిషన్ లేఖ రాశారు. హ్యాపీ నెస్ట్లో ఫ్లాట్లు కొనుగోలుచేసిన వారందరికీ సీఆర్డీఏ కమిషనర్ ఈ మేరకు లేఖ పంపారు.
కాగా... హ్యాపీ నెస్ట్ ప్రాజెక్ట్పై సీఆర్డీఏతో కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం నిర్మాణం జరగడం లేదంటూ ఫ్లాట్ల యజమానులు రెరాను ఆశ్రయించారు. ఈ క్రమంలో రెరా ఇచ్చిన ఆదేశాల ప్రకారం కట్టిన డిపాజిట్లను వెనక్కి తీసుకోవచ్చని యజమానులకు కమిషనర్ లేఖ రాశారు. హ్యాపీనెస్ట్ ప్రాజెక్ట్ నిర్మాణానికి ఇంకా కాంట్రాక్టర్ను నియమించాల్సి ఉందని తెలిపారు. ఈ మేరకు ఫ్లాట్ల యజమానులకు ఈ రోజు లేఖలు అందాయి. డిపాజిట్లను ఉంచుకోదలిస్తే దరఖాస్తూ చేయాల్సిన అవసరం లేదని కమిషనర్ పేర్కొన్నారు. మరిన్ని వివరాల కోసం సీఆర్డీఏ కార్యాలయంలో ప్రాజెక్ట్ మేనేజర్ను కలుసుకోవాలని సీఆర్డీఏ కమిషనర్ కోరారు.