జిల్లాల పునర్వ్యవస్థీకరణపై ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు
ABN , First Publish Date - 2022-02-27T01:41:50+05:30 IST
జిల్లాల పునర్వ్యవస్థీకరణపై ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు
గుంటూరు: జిల్లాల పునర్వ్యవస్థీకరణ కోసం ఉద్యోగుల కేటాయింపునకు సంబంధించి ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఉగాది నాటి నుంచి కొత్త జిల్లాల్లో పాలనకు ఆదేశాలు ఇచ్చింది. ఉగాది నాటికి నూతన జిల్లాల్లో పాలన సాగాలంటే ముందుగానే ఉద్యోగులను తాత్కాలిక ప్రాతిపదికన కేటాయించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. ఆర్డర్ టు సర్వ్ పేరుతో ఉద్యోగులను కొత్త జిల్లాలకు తాత్కాలికంగా పంపుతామంటూ ఉత్తర్వులు ఇచ్చింది. ప్రస్తుతం పాలనా సౌలభ్యం కోసమే ఆర్డర్ టు సర్వ్ పేరుతో ప్రొవిజినల్ ఎలొకేషన్ చేస్తున్నట్టు ఉత్తర్వుల్లో సర్కారు వెల్లడించింది. తుది బదిలీకి సంబంధించి మరో ప్రత్యేక జీఓ జారీ చేస్తామంటూ ఉత్తర్వుల్లో ఏపీ సర్కారు పేర్కొంది. ప్రస్తుతం సాధారణ బదిలీలపై ఉన్న బ్యాన్ను ప్రొవిజినల్ ఎలొకేషన్ కోసం అవసరమైన చోట ఎత్తేస్తున్నట్టు ఉత్తర్వులు ఇచ్చింది. తాత్కాలికంగా బదిలీ చేయబడ్డ ఉద్యోగికి నిబంధనలకు అనుగుణంగా ట్రావెలింగ్ ఎలవెన్స్ ఇవ్వబడుతుందంటూ వెల్లడించింది. ఈ మేరకు జీఓ ఎంఎస్ నెంబరు 31ని సీఎస్ సమీర్శర్మ జారీ చేశారు.