దొంగల ప్రభుత్వం బెదిరింపులకు భయపడం: సోము వీర్రాజు
ABN , First Publish Date - 2022-04-22T01:00:28+05:30 IST
రాష్ట్రంలో రేషన్ బియ్యం బ్లాక్మార్కెట్ను ప్రభుత్వం ప్రోత్సహిస్తున్నదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ఆరోపించారు.
ఒంగోలు: రాష్ట్రంలో రేషన్ బియ్యం బ్లాక్మార్కెట్ను ప్రభుత్వం ప్రోత్సహిస్తున్నదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ఆరోపించారు. దళారులతో కలిసి బియ్యం వ్యాపారం చేస్తున్నదని ధ్వజమెత్తారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ దొంగల ప్రభుత్వం పెట్టే కేసులకు భయపడేది లేదని స్పష్టం చేశారు. రేషన్ బియ్యాన్ని దళారులు రీసైక్లింగ్ చేసి ఇతర దేశాలకు అక్రమంగా తరలిస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. ప్రజలు తినడానికి ఉపయోగపడని బియ్యం ఇస్తూ బ్లాక్ మార్కెట్ను ప్రభుత్వం ప్రోత్సహిస్తున్నదని ధ్వజమెత్తారు. పేదలకు నాణ్యమైన బియ్యాన్ని అందించాలని డిమాండ్ చేశారు. కొంతమంది మంత్రులు క్రైస్తవ మనస్తత్వంతో వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. సీఎం పర్యటన కోసం బలవంతంగా కార్లు లాక్కొనే అధికారం పోలీసులకు ఎవరిచ్చారని ప్రశ్నించారు. ఈ ఘటనకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని సోము వీర్రాజు డిమాండ్ చేశారు.