విదేశీ ప్రయాణికులు మిస్సింగ్ వార్తలు అవాస్తవం: ఏపీ వైద్య ఆరోగ్య శాఖ

ABN , First Publish Date - 2021-12-03T20:48:14+05:30 IST

విదేశాల నుంచి ఆంధ్రప్రదేశ్‌కు 30 మంది ప్రయాణికులు మిస్సయ్యారన్న

విదేశీ ప్రయాణికులు మిస్సింగ్ వార్తలు అవాస్తవం: ఏపీ వైద్య ఆరోగ్య శాఖ

అమరావతి : విదేశాల నుంచి ఆంధ్రప్రదేశ్‌కు 30 మంది ప్రయాణికులు మిస్సయ్యారన్న వార్తలు గత కొన్ని గంటలుగా పెద్ద ఎత్తున హల్‌చల్ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ వార్తలపై ఏపీ వైద్య ఆరోగ్యశాఖ స్పందించి క్లారిటీ ఇచ్చింది. శనివారం నాడు అమరావతిలో మీడియా మీట్ నిర్వహించిన ఏపీ హెల్త్ డైరెక్టర్ డాక్టర్ హైమావతి.. విదేశాల నుంచి వచ్చిన 30 మంది ప్రయాణికులు మిస్సయ్యారనే వార్తల్లో వాస్తవం లేదని స్పష్టం చేశారు. ఇలాంటి వదంతుల్ని ఎవరూ నమ్మొద్దని సూచించారు. ఈ విషయంలో ప్రజలెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని.. వైజాగ్, సమీప జిల్లాలకు చెందిన 30 మంది అంతర్జాతీయ ప్రయాణికుల వివరాల్ని కేంద్రం పంపించిందని తెలిపారు. వారివారి ఇళ్లల్లో ఐసోలేషన్లో ఉండేలా వైద్య బృందాలు పర్యవేక్షిస్తున్నాయని.. డైరెక్ట్‌గా ఏపీలో విదేశీ ప్రయాణికులు దిగడానికి ఇక్కడ అంతర్జాతీయ విమానాశ్రయాలు లేవన్నారు. 


టెస్ట్‌లు చేస్తున్నాం..

వందే భారత్ స్కీం కింద విజయవాడ విమానాశ్రయానికి కొన్ని విమానాలొస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వ ప్రొటోకాల్ ప్రకారం విజయవాడ విమానాశ్రయంలో వైద్య బృందాలు పరీక్షలు నిర్వహిస్తున్నాయి. రాష్ట్రంలోని అన్ని విమానాశ్రయాల్లో ఇప్పటికే వైద్య బృందాల్ని ఏర్పాట్లు చేశాం. వైద్య బృందాల పర్యవేక్షణలో నిరంతరం స్క్రీనింగ్, టెస్టులు చేస్తున్నారు అని హైమావతి స్పష్టం చేశారు.


కాగా.. ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో గుబులు పుట్టిస్తున్న ఒమైక్రాన్‌ మన దేశంలోనూ అడుగు పెట్టింది. బెంగళూరులో ఇద్దరికి గురువారం ఒమైక్రాన్‌ నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని స్వయంగా కేంద్ర ప్రభుత్వమే ప్రకటించింది. మరికొందరు విదేశీ ప్రయాణికుల నమూనాల జన్యు విశ్లేషణ ఫలితాలు రావాల్సి ఉంది. దాంతో, ఒమైక్రాన్‌ కేసులు నమోదైన దేశాల సంఖ్యకు 30కి చేరింది.

Updated Date - 2021-12-03T20:48:14+05:30 IST