చంద్రబాబుకు మంత్రి అవంతి శ్రీనివాస్ సవాల్

ABN , First Publish Date - 2020-08-08T18:44:32+05:30 IST

టీడీపీ అధినేత చంద్రబాబుపై మంత్రి అవంతి శ్రీనివాస్ తీవ్ర విమర్శలు చేశారు. గత ఐదేళ్లలో చంద్రబాబు చేసిందేమీ లేదని వ్యాఖ్యానించారు. ఇప్పుడేమో ముసలి

చంద్రబాబుకు మంత్రి అవంతి శ్రీనివాస్ సవాల్

విశాఖ: టీడీపీ అధినేత చంద్రబాబుపై మంత్రి అవంతి శ్రీనివాస్ తీవ్ర విమర్శలు చేశారు. గత ఐదేళ్లలో చంద్రబాబు చేసిందేమీ లేదని వ్యాఖ్యానించారు. ఇప్పుడేమో ముసలి కనీళ్లు కారుస్తున్నారని ద్వజమెత్తారు. ‘గత ఐదు సంవత్సరాల్లో ఏమీ చేయకుండా కాలయాపన చేశారు. విశాఖకు చాలా చేస్తామని చెప్పి.. ఏమీ చేయకుండానే మిగిలిపోయారు. ఐదు సంవత్సరాల్లో విశాఖను పర్యాటకంగా ఏం అభివృద్ధి చేశారో చెప్పాలి. ఉన్న డబ్బులు అమరావతికి పెట్టి మిగిలిన పథకాలు అన్ని పక్కకు పెట్టారు. సీఆర్డీఏ అంటే చంద్రబాబు రియల్ ఎస్టేట్ అని వ్యాఖ్యానించారు. చంద్రబాబు ఉదయం సింగపూర్, మధ్యాహ్నం చైనా కోసం మాట్లాడేవారు. అమరావతి రైతులపై అంత ప్రేమ ఉంటే.. లోకేష్‌ను అక్కడి ప్రజలు ఎందుకు ఓడించారో చెప్పాలి. సింహాచలం పంచగ్రామాల సమస్యను చంద్రబాబు పట్టించకోకుండా కాలయాపన చేశారు. సుజల స్రవంతి, స్టీల్ ప్లాంట్ గనుల సమస్య చంద్రబాబు మాటలకే పరిమితం అయ్యారు. అమరావతి రైతుల ఉద్యమంపై వైసీపీ నేతలెవరూ తప్పుగా మాట్లాడలేదు. అమరావతి రాజధానిగా ఉంచుతూనే విశాఖ, కర్నూలును అభివృద్ధి చేస్తాం. చంద్రబాబు వ్యక్తిగత ప్రయోజనాల కోసమే పాటుపడ్డారు అందుకే 23 సీట్లుకే పరిమితం చేశారు. 3 ప్రాంతాలు అభివృద్ధి చెందాలన్నదే ప్రభుత్వం లక్ష్యం. విశాఖ ప్రజల మనోభావాలు దెబ్బతినేలా చంద్రబాబు మాట్లాడొద్దు. ఒకవేళ విశాఖలో రాజధాని వద్దనుకుంటే నలుగురు టీడీపీ ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించాలి.’ అని చంద్రబాబుకు మంత్రి సవాల్ విసిరారు.

Updated Date - 2020-08-08T18:44:32+05:30 IST