‘సోమవారం రోజు ఆ మూడు హత్యలు నేనే చేశా’
ABN , First Publish Date - 2022-08-16T15:56:26+05:30 IST
‘సోమవారం రోజు ఆ మూడు హత్యలు నేనే చేశా’
విశాఖ: సైకో కిల్లర్ రాంబాబును పోలీసులు అరెస్ట్ చేశారు. అపార్ట్మెంట్లలో పనిచేసే వాచ్మెన్ కుటంబాలనే హత్యలు చేయాలనే టార్గెట్ పెట్టుకున్నట్లు పోలీసులు గుర్తించారు. సైకో కిల్లర్ రాంబాబు ఇప్పటికి మూడు హత్యలు చేశాడు. నిందితుడు నర్సీపట్నానికి చెందిన రాంబాబుగా గుర్తించారు. కేసు నమోదు చేసుకుని విచారణ జరపుతున్నారు.
శివారు ప్రాంతంలో నిర్మాణంలో ఉన్న అపార్ట్మెంట్లను లక్ష్య్గంగా చేసుకుని అర్ధరాత్రి సమయంలో ఈ హత్యలకు పాల్పడుతున్నట్టు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. సెల్లార్లో ఎటువంటి భద్రత లేని వాచ్మన్ కుటుంబాలను టార్గెట్ చేసుకుంటున్నట్టు తెలుస్తోంది. పట్టుబడ్డ అనుమానితుడిని నర్సీపట్నం సమీప బొడ్డేపల్లి శివారు వీరవాసరం గ్రామానికి చెందిన రాంబాబుగా గుర్తించారు. అతను కొంతకాలం కుటుంబంతో సహా హైదరాబాద్లో ఉండేవాడని, అతడి ప్రవర్తన నచ్చక భార్య విడిచిపెట్టి వెళ్లిపోయిందని తెలిసింది. దీంతో ఉన్మాదిగా మారి, పలు ప్రాంతాల్లో సంచరిస్తూ పెందుర్తి వచ్చాడని చెబుతున్నారు. ఇక్కడికి వచ్చిన తరువాత ఓ రియల్ ఎస్టేట్ సంస్థలో పనిచేస్తూ పెందుర్తి ప్రశాంతినగర్లో నివసించేవాడని, కొద్దిరోజులుగా అక్కడ కనిపించడం లేదని అంటున్నారు. గత నెలలో పెందుర్తి అఖిలేశ్వరి ఆస్పత్రి వద్ద నిర్మాణంలో ఉన్న అపార్టుమెంట్ సెల్లార్లో వాచ్మన్ భార్య, కుమారుడు నిద్రస్తుండగా గుర్తుతెలియని వ్యక్తి ముఖంపై కొట్టి తీవ్రంగా గాయపరిచాడని పోలీసులకు ఫిర్యాదు అందింది. ఇదే తరహాలో వారం క్రితం చినముషిడివాడలో నిర్మాణంలో ఉన్న అపార్ట్మెంట్లో వృద్ధ దంపతులు హత్యకు గురయ్యారు. వారం రోజుల వ్యవధిలో సుజాతనగర్లో వాచ్మన్ భార్య హత్యకు గురయ్యారు. ఈ మూడు ఘటనలు ఒకే తీరుగా ఉండడం, అన్నీ సోమవారం రోజునే జరగడం చర్చనీయాంశమైంది. కాగా, ఆ హత్యలు తానే చేశానని పోలీసుల విచారణలో అనుమానితుడు అంగీకరించినట్టు తెలిసింది. పూర్తి వివరాలు త్వరలో వెల్లడిస్తామని సీఐ అశోక్కుమార్ చెప్పారు.