టీడీపీలో మరో ఇన్చార్జికి లైన్ క్లియర్
ABN , First Publish Date - 2022-09-30T09:58:16+05:30 IST
టీడీపీలో మరో ఇన్చార్జికి లైన్ క్లియర్
ఎర్ర గొండపాలెం ఇన్చార్జిగా ఎరిక్షన్బాబు ఖరారు
అమరావతి, సెప్టెంబరు 29 (ఆంధ్రజ్యోతి): తెలుగుదేశం పార్టీలో మరో ఇన్చార్జికి లైన్ క్లియర్ అయింది. ప్రకాశం జిల్లా ఎర్ర గొండపాలెం రిజర్వుడు నియోజకవర్గానికి ఎరిక్షన్ బాబును ఇన్చార్జిగా ధ్రువీకరిస్తున్నట్లు ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రకటించారు. దీనికి ఒక రోజు ముందు అదే ప్రాంతంలోని చీరాలకు ఇన్చార్జిగా కొండయ్య యాదవ్ను ఖరారు చేశారు. ఎర్ర గొండపాలెం నియోజకవర్గానికి కొంతకాలంగా పోటీ నెలకొంది. ఎరిక్షన్బాబుతోపాటు మరి కొందరు తమ ప్రయత్నాలు ముమ్మరంగా చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎరిక్షన్ బాబును మార్చేది లేదని చంద్రబాబు స్పష్టం చేశారు. గురువారం ఇక్కడ జరిగిన సమీక్ష తర్వాత ఆయన ఈ విషయం చెప్పారు. ఎరిక్షన్ బాబుకు సహకరించాలని.. ఆ నియోజకవర్గాన్ని గెలిపించి తీసుకురావాలని నియోజకవర్గ నేత మన్నె రవీంద్రకు చంద్రబాబు సూచించారు. గురువారం నాటి సమీక్షలో ఎరిక్షన్బాబుతోపాటు విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్రావు, చీపురుపల్లి ఇన్చార్జి కిమిడి నాగార్జున, రాయదుర్గం ఇన్చార్జి కాల్వ శ్రీనివాసులు, సాలూరు ఇన్చార్జి గుమ్మడి సంధ్యారాణి, మచిలీపట్నం ఇన్చార్జి కొల్లు రవీంద్ర కూడా పాల్గొన్నారు.