ఏఎన్యూ వీసీ స్వామిభక్తి!
ABN , First Publish Date - 2022-09-30T09:06:35+05:30 IST
ఏఎన్యూ వీసీ స్వామిభక్తి!
ప్రమాణస్వీకారంలో జై జగన్ నినాదాలు
వైసీపీ కార్యకర్తలను తలపించిన ఉద్యోగులు
సోషల్ మీడియాలో వీడియో వైరల్
గుంటూరు, సెప్టెంబరు 29(ఆంధ్రజ్యోతి): భావి భారత పౌరులను తీర్చిదిద్దే విశ్వవిద్యాలయాలను సైతం కొందరు అధికారులు, ఉద్యోగులు రాజకీయాలతో కలుషితం చేస్తున్నారు. ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయానికి ఇన్చార్జ్ బాధ్యతల్లో కొనసాగిన రాజశేఖర్ను రెగ్యులర్ వీసీగా నియమిస్తూ రెండు రోజుల క్రితం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఆ వెంటనే ఆయన బాధ్యతలు చేపట్టగా, అధ్యాపకులు, ఉద్యోగులు వైసీపీ కార్యకర్తలను తలపించేలా ‘జై జగన్...జై జై జగన్.. రాజశేఖర్(వీసీ) నాయకత్వం వర్ధిల్లాలి’ అంటూ నినాదాలు చేశారు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవటంతో సామాన్యులు సైతం ముక్కున వేలేసుకుంటున్నారు. ఇన్చార్జిగా వ్యవహరించిన సమయంలోనే ఆయనపై పలు అవినీతి ఆరోపణలు వెల్లువెత్తాయి. అయితే, వైఎస్ కుటుంబ జపం చేస్తూ పదవిని కాపాడుకుంటూ వచ్చారని ఆయనపై విమర్శలు వచ్చాయి. తద్వారా ఇప్పుడు రెగ్యులర్ వీసీ హోదా పొందారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.