శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటలు
ABN , First Publish Date - 2022-05-22T08:49:38+05:30 IST
శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటలు
తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ
తిరుమల, మే 21 (ఆంధ్రజ్యోతి): తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శుక్రవారం సాయంత్రం నుంచే భక్తుల రాక పెరిగింది. శనివారం శ్రీవారి ఆలయం ప్రాంతంతో పాటు మాడవీధులు, అఖిలాండం, లడ్డూ కౌంటర్, అన్నప్రసాద భవనం, బస్టాండ్, యాత్రికుల వసతి సముదాయాలు రద్దీగా కన్పించాయి. వైకుంఠం క్యూకాంప్లెక్స్లోని 31 కంపార్టుమెంట్లు, నారాయణగిరి ఉద్యానవనంలోని షెడ్లు నిండిపోయి లేపాక్షి సర్కిల్ మీదుగా పీఏసీ-4 లగేజీ కౌంటర్ వరకు సర్వదర్శనం క్యూలైన్ దాదాపు రెండు కిలోమీటర్ల మేర వ్యాపించింది. దాదాపు 24 గంటల తర్వాత శ్రీవారి దర్శనం లభిస్తుండడంతో చిన్నపిల్లలు, వృద్ధులతో వచ్చిన భక్తులు క్యూలైన్లలో తీవ్ర ఇబ్బందులు పడ్డారు. గదుల కోసం గంటల తరబడి క్యూలైన్లో వేచి ఉండాల్సి వస్తోంది.