జగన్ మోదీ దత్తపుత్రుడు
ABN , First Publish Date - 2022-05-22T08:49:08+05:30 IST
జగన్ మోదీ దత్తపుత్రుడు
ఆయనను ప్రశ్నిస్తే జైలుకే
రాజ్యాంగ పరిరక్షణకు దేశవ్యాప్త ఉద్యమం
25 నుంచి 30 వరకు
నిర్వహిస్తాం: సీపీఐ నారాయణ
పత్తికొండటౌన్, మే 21: కేంద్రంలో మోదీ విధానాలను సీఎం జగన్మోహన్రెడ్డి ప్రశ్నించలేకపోతున్నారని, ఒక వేళ ప్రశ్నిస్తే జైలు ఊచలు లెక్కపెట్టడం ఖాయమని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. శనివారం కర్నూలు జిల్లా పత్తికొండలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ప్రభుత్వరంగ సంస్థలను మోదీ కారుచౌకంగా అమ్మేస్తూ ప్రభుత్వ రంగాలను దెబ్బతీస్తున్నారని ఆరోపించారు. దేశంలో లౌకికవాదం, రాజ్యాంగ హక్కులకు ముప్పు వాటిల్లిందన్నారు. ప్ర భుత్వ రంగ సంస్థలను కాపాడుకునేందుకు, ధరల పెం పుపై, లౌకికవాదం, రాజ్యాంగ పరిరక్షణ కోసం ఈనెల 25 నుంచి 30వ తేదీ వరకు కలిసి వచ్చే రాజకీయ పార్టీలతో దేశవ్యాప్త ఉద్యమం చేపడుతున్నట్లు తెలిపారు. ‘ఏడేళ్ల మోదీ పాలనలో రూ.82 లక్షల కోట్ల అప్పు చేశారు. 23 ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మేశారు. రైతులకు మీటర్లు బిగించే విధానం బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కూడా అమలు కావడంలేదు. ఒక్క ఏపీలోనే శ్రీకారం చుట్టడం దుర్మార్గమైన చర్య. వైసీపీ నాయకులు ప్రజలను బెదిరిస్తుంటే అదే వైసీపీని అమిత్షా బ్లాక్మెయిల్ చేస్తున్నారు. చంద్రబాబుకు దత్తపుత్రుడు పవన్కల్యాణ్ అని వైసీపీ నాయకులు అంటున్నారు. చంద్రబాబుకు సొంత కొడుకు ఉన్నాడు. అలాంటప్పుడు పవన్ దత్తపుత్రుడు ఎలా అవుతారు? అసలు మోదీకి దత్తపుత్రుడు ఎవరంటే జగనే. మోదీకి పిల్లలు లేరు కాబట్టి ఆ పదం ఆయనకు వర్తిస్తుంది’ అన్నారు. ఏపీలో ప్రజాస్వామ్యం ఉందన్న నమ్మకం కలగడం లేదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు. డ్రైవర్ హత్య కేసులో ఎమ్మెల్సీ ఉదయభాస్కర్ను అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు.