వైసీపీ ప్రభుత్వంలో దళితులపై హత్యాకాండ
ABN , First Publish Date - 2022-05-22T08:36:28+05:30 IST
వైసీపీ ప్రభుత్వంలో దళితులపై హత్యాకాండ
విశాఖపట్నం దళిత సంఘాల ఐక్యవేదిక ఆందోళన
ఎమ్మెల్సీ అనంతబాబును అరెస్టు చేయాలని డిమాండ్
డాబాగార్డెన్స్ (విశాఖపట్నం), మే 21: వైసీపీ ప్రభుత్వంలో దళితులపై హత్యాకాండకు అంతం లేదా? అని విశాఖపట్నం దళిత సంఘాల (విదసం) ఐక్యవేదిక ప్రతినిధులు ప్రశ్నించారు. కాకినాడలో దళిత యువకుడు సుబ్రహ్మణ్యంను హత్య చేసిన వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబును తక్షణం అరెస్టు చేయాలని, ఆయన్ను పదవి నుంచి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. ఐక్యవేదిక కన్వీనర్ బూసి వెంకటరావు ఆధ్వర్యంలో దళితులు అంబేడ్కర్ విగ్రహం వద్ద శనివారం నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వెంకటరావు మాట్లాడుతూ పేరుకు దళిత మహిళను హోంమంత్రిని చేసి, అడ్డూఅదుపూ లేకుండా దళితులపై హత్యాకాండను అధికార పార్టీ నాయకులు కొనసాగిస్తున్నారని ధ్వజమెత్తారు. ఆందోళనలో వేదిక ప్రతినిధులు ఈతలపాక సుజాత, సోడదాసు సుధాకర్, సుజాత, నిర్మల, హరిబాబు తదితరులు పాల్గొన్నారు.