పోలవరానికి వైసీపీతో ముప్పు!

ABN , First Publish Date - 2022-05-22T08:15:20+05:30 IST

పోలవరానికి వైసీపీతో ముప్పు!

పోలవరానికి వైసీపీతో ముప్పు!

ప్రాజెక్టు సాకారం ఎప్పటికి?

మాటలు తప్ప చేతలు లేవు

పుస్తకావిష్కరణ సభలో వక్తలు


విజయవాడ, మే 21(ఆంధ్రజ్యోతి): పోలవరం ప్రాజెక్టు నిర్మాణంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మాటలు చెబుతున్నాయి తప్ప చేతల్లో అడుగు ముందుకు పడడం లేదని పలువురు వక్తలు విమర్శించారు. ఈ ప్రాజెక్టుపై ఉన్న అనిశ్చితికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలే కారణమన్నారు. ముఖ్యంగా పోలవరం ప్రాజెక్టుకు వైసీపీ అనుసరిస్తున్న విధానాలే ప్రధాన ముప్పుగా పరిణమించాయని చెప్పారు. విజయవాడలో శనివారం సీపీఐ నేత కొల్లి నాగేశ్వరరావు వర్థంతి సభలో.. సామాజిక ఉద్యమకర్త టి.లక్ష్మీనారాయణ రాసిన ‘పోలవరం ఎన్నటికి సాకారమయ్యేను!’ పుస్తకాన్ని మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు ఆవిష్కరించారు. కార్యక్రమంలో కాంగ్రెస్‌ నేత తులసిరెడ్డి, సీపీఐ నేత ముప్పాళ్ల నాగేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే దాసరి బాలవర్థనరావు, చలసాని శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు. పోలవరం నిర్మాణాన్ని యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని వారు డిమాండ్‌ చేశారు. ఇందుకోసం రాజకీయాలకు అతీతంగా పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. వరద ప్రవాహా నికి డయాఫ్రం వాల్‌ దెబ్బతినడం సర్వత్రా ఆందోళన కలిగిస్తోందన్నారు. దీని మరమ్మతులకు ఎంతకా లం పడుతుంది? దానికయ్యే ఖర్చును ఎవరు భరిస్తారు? అన్న ప్రశ్నలకు కేంద్ర, రాష్ట్రాలు సమాధానాలు చెప్పడం లేదన్నారు. ప్రాజెక్టులో డెడ్‌ స్టోరేజ్‌(32-35మీటర్ల) నుంచి నిల్వ ఉండే నీటిని తరలించడానికి ఎత్త్తిపోతల పథకం నిర్మాణానికి పూనుకోవడాన్ని బట్టి చూస్తే పోలవరం ప్రాజెక్టు మనుగడకు వైసీపీ ప్రభుత్వం తీవ్రమైన ముప్పును తెస్తోందన్న అనుమానాన్ని వ్యక్తం చేశారు. కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ, సాంకేతిక సలహా మండలి ఆమోదించిన రెండో డీపీఆర్‌ అంచనా వ్యయం 55,548 కోట్లకు అంగీకరించి, ఆ నిధులను విడుదల చేయకుండా కేంద్రం దగా చేస్తోందని ధ్వజమెత్తారు. రాయలసీమ, ఉత్తరాంధ్రలోని ప్రాజెక్టులను సత్వరం పూర్తి చేయాలని డిమాండ్‌ చేశారు.

Updated Date - 2022-05-22T08:15:20+05:30 IST