మా కుక్క కనిపించట్లేదు
ABN , First Publish Date - 2022-05-22T08:52:03+05:30 IST
మా కుక్క కనిపించట్లేదు
వివేకా హత్యకేసు నిందితుడి భార్య ఆందోళన
పోలీసులకూ తెలిపిన ఉమాశంకర్రెడ్డి కుటుంబం
పులివెందుల, మే 21: తమ పెంపుడు కుక్క శుక్రవారం నుంచి కనిపించకుండా పోయిందని మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో మూడో నిందితుడు గజ్జల ఉమాశంకర్రెడ్డి భార్య స్వాతి ఆందోళన వ్యక్తం చేశారు. శనివారం తమ నివాసంలో మీడియాతో ఆమె మాట్లాడుతూ తన భర్త ఇంటి దగ్గర లేనప్పటి నుంచి ఆ కుక్క తమకు తోడుగా ఉందని, అందువల్లే ఇప్పటివరకు ధైర్యంగా ఉన్నామన్నారు. ఈ విషయాన్ని పోలీసులకు కూడా వివరించానన్నారు.
వివేకా హత్యకు 3 రోజుల ముందు..
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి 2019 మార్చి 15న హత్యకు గురైన విషయం తెలిసిందే. ఆ హత్యకు మూడురోజుల ముందు ఆయన పెంపుడు కుక్క చనిపోయింది. ఈ కుక్కను గజ్జల ఉమాశంకర్రెడ్డి, సునీల్యాదవ్ కారుతో ఢీకొట్టి చంపేశారని అప్రూవర్గా మారిన దస్తగిరి ఇచ్చిన వాంగ్మూలంలో పేర్కొన్నాడు. ఈ నేపథ్యంలో ఇప్పుడు గజ్జల ఉమాశంకర్రెడ్డి ఇంటి వద్ద కుక్క కనిపించకపోవడం అతని కుటుంబసభ్యుల ఆందోళనకు కారణమైంది.