జీతాల సంకటం

ABN , First Publish Date - 2022-01-23T08:30:46+05:30 IST

జీతాల సంకటం

జీతాల సంకటం

ఒకటో తేదీ గండం తప్పిందని సర్కారు సంబరం

సందిగ్ధంలో జనవరి నెల సిబ్బంది వేతనాలు

రివర్స్‌ పీఆర్సీ వ్యవహారంతో వస్తాయో రావో

పాత జీతాలే ఇవ్వాలని ఉద్యోగుల డిమాండ్‌

డిసెంబరు జీతాల్లోనే 1000 కోట్లు పెండింగ్‌

ఇంకా ఓడీలోనే జగన్‌ ప్రభుత్వం


అమరావతి, జనవరి 22 (ఆంధ్రజ్యోతి): ఉద్యోగులకు జీతాలు, పెన్షన్లు ఇవ్వడానికి ప్రతినెలా అప్పుల కోసం వెతుక్కునే ప్రభుత్వానికి ఉద్యోగుల సమ్మె కూడా కలిసొచ్చే అంశం లాగానే కనిపిస్తోంది. ఉద్యమంలో భాగస్వాములైన ట్రెజరీ, పీఏవో, వర్క్‌ పీఏవో కార్యాలయాల్లోని ఉద్యోగులు.. కొత్త పీఆర్సీల ప్రకారం జీతాలు, పెన్షన్లు ప్రాసెస్‌ చేయబోమని ఇప్పటికే ప్రభుత్వానికి స్పష్టంచేశారు. పాత జీతాలు ప్రాసెస్‌ చేద్దామంటే మొత్తం సిస్టమ్‌లో నుంచి పాత విధానం తాలూకు సాఫ్ట్‌వేర్‌ను ప్రభుత్వం పూర్తిగా తొలగించింది. దీంతో ఒకటో తేదీ గండం తప్పిందని ప్రభుత్వానికి సంబరపడే సమయం వచ్చిందని ఉద్యోగులు వ్యాఖ్యానిస్తున్నారు. డిసెంబరు నెలకు సంబంధించి జనవరిలో ఇవ్వాల్సిన జీతాలు, పెన్షన్లు ఇంకా రూ.1000 కోట్లకు పైగా పెండింగ్‌లో ఉన్నాయి. 23వ తేదీ వచ్చినా ఇంకా పూర్తి జీతాలు చెల్లించలేకపోవడం, పైపెచ్చు ఖజానాలో చిల్లిగవ్వ లేకుండా ప్రభుత్వం ఓడీ రూపంలో ఆర్‌బీఐకి అప్పు పడడం అనేవి రాష్ట్రం ఆర్థికంగా దివాలా తీసిందనడానికి స్పష్టమైన సంకేతాలు! కేంద్రం నుంచి ఇవాళో రేపో కేంద్రం పన్నుల్లో రాష్ట్రం వాటా  కింద రూ.3,000 కోట్లు వస్తాయని ప్రభుత్వం అంచనా వేస్తోంది. అందుకే ఈ నెల 10వ తేదీ నుంచి వాయిదా పడుతూ వస్తోన్న ఈబీసీ నేస్తం పథకాన్ని ఈ నెల 25వ తేదీన ప్రారంభిస్తున్నట్టు ప్రభుత్వం కొత్తగా ప్రకటన చేసింది. ఆ వచ్చిన రూ.3,000 కోట్లు వేజ్‌ అండ్‌ మీన్స్‌ అప్పు, స్పెషల్‌ డ్రాయల్‌ లిమిట్‌ అప్పు, ఓడీ కింద ఆర్‌బీఐ వద్ద పూర్తిగా జమ అయిపోతాయి. మళ్లీ వేజ్‌ అండ్‌ మీన్స్‌ అప్పు లేదా ఓడీకి వెళ్లి డబ్బు అప్పు తెచ్చి జగన్‌ ప్రభుత్వం ఈబీసీ నేస్తం పథకం అమలు చేయాలని భావిస్తోంది. కేంద్రం జనవరిలో తమకు రూ.23,000 కోట్ల కొత్త అప్పులకు అనుమతిస్తుందని రాష్ట్ర ప్రభుత్వం భారీగా ఆశలు పెట్టుకుంది. పైగా సీఎం జగన్‌...ప్రధానమంత్రి నరేంద్ర మోదీని, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ను సైతం కలిశారు కాబట్టి ధారాళంగా అప్పులకు అనుమతులు వస్తాయని భావించారు. కానీ, కేంద్రం కేవలం రూ.2,500 కోట్ల అప్పులకు మాత్రమే అనుమతిచ్చి సరిపెట్టింది. ఆ అప్పును ఆర్‌బీఐ నుంచి ఒ క్కరోజులో తెచ్చేసి.. ఉద్యోగులకు వేతనాలు కూడా ఇవ్వకుండా ప్రభుత్వం వాడేసింది. 


ఆగితే మూడేళ్లు అంతే!

కేంద్రం ఏపీ అప్పులపై ప్రత్యేకంగా దృష్టి సారించినట్టు తెలుస్తోంది. గడచిన రెండున్నరేళ్లలో చేయాల్సిన అప్పుల కంటే ఎంతైతే ఎక్కువ అప్పులు చేశారో అంత మేర అప్పుల మొత్తానికి కొత్తగా అనుమతివ్వకుండా కేంద్రం నిలిపివేసింది. కేంద్రం పైపైన దృష్టి సారిస్తేనే జగన్‌ ప్రభుత్వం ఈ నెల 22వ తేదీ వచ్చినా ఇంకా పూర్తిగా వేతనాలు, పెన్షన్లు ఇవ్వలేకపోయింది. ఇక కార్పొరేషన్ల పేరుతో జగన్‌ ప్రభుత్వం తెచ్చిన దొంగ అప్పులన్నింటినీ పరిగణనలోకి తీసుకుంటే....మరో మూడేళ్ల పాటు ఏపీకి ఒక్క పైసా అప్పునకు కూడా అనుమతి ఉండదు. అత్యంత వివాదాస్పదమైన రాష్ట్రాభివృద్ధి కార్పొరేషన్‌ నుంచి ప్రభుత్వ ఖర్చుల కోసం రూ.25,000 కోట్లు అప్పు తెచ్చినట్టు ప్రభుత్వమే ఒప్పుకొంది. ఆర్థికశాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి నేరుగానే ఈ విషయం చెప్పారు. ఈ వ్యవహారానికి సంబంధించి కోర్టులో దాఖలైన కేసుకు సంబంధించి ప్రభుత్వం వేసిన కౌంటర్‌లోనూ ఈ అప్పునకు సంబంధించిన వివరాలున్నాయి. అంటే ఈ రూ.25,000 కోట్ల అప్పును కేంద్రానికి తెలియకుండా, అనుమతి లేకుండా ముందుగానే రాష్ట్ర ప్రభుత్వం వాడేసింది కాబట్టి, వచ్చే ఆర్థిక సంవత్సరం ఏప్రిల్‌ నుంచి కొత్తగా కేంద్రం అనుమతివ్వాల్సిన అప్పుల మొత్తంలో నుంచి ఈ రూ.25,000 కోట్ల అప్పును కేంద్రం మినహాయించుకుంటుందని ఆర్థిక నిపుణులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఉద్యోగులు మరింత ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రెండు వారాలపాటు అప్పు పుట్టకపోతేనే తమ వేతనాలు 20 శాతం కోసేసిన ప్రభుత్వం... ఇక ముందు ప్రతి నెలా తమ వేతనాల్లో ఎంతో కొంత కోత విధించే ప్రమాదం ఉందని వారు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ సమస్యపై ఇప్పుడు గట్టిగా ఎదురుతిరిగి ప్రభుత్వంతో తేల్చుకోకపోతే కనీసం తమకు సగం వేతనాలు కూడా అందకపోవచ్చునన్న ఆందోళన వ్యక్తం చేశారు.  ఖజానాకి వస్తున్న వేల కోట్ల డబ్బులు ఎటుపోతున్నాయో తెలియడం లేదని, అత్యవసర ఖర్చులన్నింటినీ ప్రభుత్వం పెండింగ్‌లోనే ఉంచినప్పటికీ ఇంకా ఎందుకు ఓడీలో కొనసాగాల్సి వస్తోందో అర్థం కావడం లేదని అంటున్నారు.  


చెల్లింపుల్లోనూ కేంద్రంలాగే ఇస్తారా..?

ఉద్యోగులకు 27 శాతం ఐఆర్‌ ఇచ్చామని గొప్పలు చెప్పుకున్న ప్రభుత్వం ఇప్పుడు ఆ ఐఆర్‌ డబ్బులు మొత్తాన్ని బలవంతంగా లాక్కుంటోందని ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పెండింగ్‌ డీఏలను అడ్డం పెట్టుకుని 9 నెలల కాలానికి సంబంధించిన 27 శాతం ఐఆర్‌ను, 21 నెలల కాలానికి సంబంధించి 4 శాతం ఐఆర్‌ను రికవరీ చేస్తున్న దుర్మార్గపు ప్రభుత్వాన్ని ఇంతవరకు చూడలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.  పీఆర్సీ పేరుతో జగన్‌ ప్రభుత్వం ఉద్యోగులను దోపిడీ చేస్తోందని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న క్యాష్‌లెస్‌ కార్డు పట్టుకుని ఆస్పత్రులకు వెళ్తే ఎవ్వరూ కనీసం మొహం కూడా చూడడం లేదని ఉద్యోగులు వాపోతున్నారు. కేంద్రం ఇచ్చినట్టే ఉద్యోగులకు హెచ్‌ఆర్‌ఏ ఇస్తున్నామని చెప్తున్న ప్రభుత్వం... అన్ని ప్రయోజనాలు కేంద్రం ఇచ్చినట్టే ఇ వ్వాలని డిమాండ్‌ చేస్తున్నారు. కేంద్రంలో, రాష్ట్రంలో సమాన కేడర్‌లో ఉన్న ఉద్యోగులను తీసుకుంటే రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న వేతనాలు చాలా తక్కువగా ఉన్నాయని, హెచ్‌ఆర్‌ఏ విషయంలో కేంద్రాన్ని అనుసరిస్తున్న జగన్‌ సర్కార్‌.... జీతంవిషయంలోనూ కేంద్రాన్ని అనుసరించాలని కోరారు. అలాగే, కేంద్రం తన ఉద్యోగులకు ఇచ్చే హెల్త్‌ కార్డులు పక్కాగా ఉంటాయని, తమకూ అ లాంటి హెల్త్‌కార్డుల సౌకర్యం కల్పించాలని కోరుతున్నారు. 

Updated Date - 2022-01-23T08:30:46+05:30 IST