ఏపీ రాజధాని ఎక్కడుందో..!

ABN , First Publish Date - 2021-10-25T08:32:43+05:30 IST

ఏపీ రాజధాని ఎక్కడుందో..!

ఏపీ రాజధాని ఎక్కడుందో..!

అమరావతిలోనా... విశాఖలోనా...

తాడేపల్లిలోని ఇనుప కంచెల మధ్యనా..?: ఎమ్మెల్సీ ఐవీ


పెద్దాపురం, అక్టోబరు 24: రాష్ట్ర రాజధాని అమరావతిలోనా లేక విశాఖలోనా లేదా తాడేపల్లిలోని ఇనప కంచెల మధ్య ఉందో అర్థంకాని పరిస్థితి ఉందని ఉభయ గోదావరిజిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఇళ్ల వెంకటేశ్వరావు (ఐవీ) అన్నారు. తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురంలో నిర్వహిస్తున్న విద్యా వైజ్ఞానిక శిక్షణ తరగతుల కార్యక్రమాలకు వచ్చిన ఆయన స్థానిక విలేకరులతో మాట్లాడారు. దేశంలో ఎక్కడా లేని విధంగా శాసనసభ, శాసనమండలి సమావేశాలు అతి తక్కువ రోజులు నిర్వహించిన ఘనత జగన్‌ జమానాదేనన్నారు. బడ్జెట్‌ సమావేశాలను ఒక్క రోజులో ముగిస్తున్నారని విమర్శించారు. ఉద్యోగ, ఉపాధ్యాయ సమస్యలపై లేఖలు ఇవ్వడానికి వెళ్లాలంటే రాజధాని అమరావతిలో మంత్రులు, అధికారులు ఎవ్వరూ అందుబాటులో ఉండడం లేదని, తాడేపల్లిలోని ఇనుప కంచెల లోపల చక్కర్లు కొడుతున్నారని విమర్శించారు. రాష్ట్రంలో ప్రస్తుతం అసలు సమస్యలు పక్కకు పోయాయని, బూతుల మీద చర్చలు జరిగే పరిస్థితి నెలకొందన్నారు. రాష్ట్ర శాసన సభ, మండలిలో అవహేళనగా మాట్లాడుతుంటే, తిడుతూంటే శాడిస్టుల్లా ముసిముసి నవ్వులు నవ్వే వారిని చూస్తున్నామని అన్నారు. అలాంటి వేదిక లోపల తాము ఉన్నందుకు విచారంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఎయిడెడ్‌ విద్యా రంగాన్ని ఉరికంభం ఎక్కించిందని, ఉపాధ్యాయులను షిఫ్టు చేసే క్రమంలో విద్యార్థుల భవిష్యత్‌ అగమ్యగోచరంగా మారిందని అన్నారు. ఎయిడెడ్‌ కళాశాలలను ప్రభుత్వమే స్వాధీనం చేసుకోవాలని లేదా ప్రభుత్వమే డిగ్రీ, జూనియర్‌ కళాశాలలను ప్రారంభించాలని ఎమ్మెల్సీ డిమాండ్‌ చేశారు.

Updated Date - 2021-10-25T08:32:43+05:30 IST