పంటసొమ్ము అందక ఆత్మహత్యాయత్నం
ABN , First Publish Date - 2021-10-25T09:04:38+05:30 IST
పంటసొమ్ము అందక ఆత్మహత్యాయత్నం
మొక్కజొన్న పంట అమ్మి ఆర్నెల్లు.. ఇప్పటికీ ఖాతాలో జమ కాని డబ్బు
పురుగుమందు తాగిన కౌలురైతు.. కృష్ణాజిల్లా షేర్మహ్మద్పేటలో ఘటన
పర్చూరు, జగ్గయ్యపేట, అక్టోబరు 24: ఆరుగాలం పండించిన మొక్కజొన్న అమ్మి ఆరు నెలలైనా డీసీఎంఎస్ నుంచి డబ్బులు జమకాక మనస్తాపంతో కౌలురైతు ఆత్మహత్యకు యత్నించాడు. కృష్ణాజిల్లా జగ్గయ్యపేట మండలం షేర్మహ్మద్పేటలో ఆదివారం జరిగిందీ ఘటన. కౌలు రైతు షేక్ కరీం సాహెబ్(52) గ్రామంలో నాలుగు ఎకరాలు కౌలుకు తీసుకుని మొక్కజొన్న సాగు చేశారు. క్వింటాల్ రూ.1,850 చొప్పున ఏప్రిల్లో మల్కాపురం డీసీఎంఎస్ ద్వారా రెండు విడతలుగా 84.5 క్వింటాళ్లను రూ.1.55 లక్షలకు విక్రయించారు. అయితే ఆ డబ్బు ఆయన బ్యాంకు ఖాతాలో జమకాలేదు. బ్యాంకు ఖాతా సక్రమంగా లేదని అధికారులు చెప్పటంతో బ్యాంకులో సవరణ చేయించి విజయవాడ కార్యాలయంలో అందజేశారు. ఆర్నెల్లుగా కార్యాలయాల చుట్టూ తిరిగినా డబ్బులు ఖాతాకే పడతాయని అధికారులు చెప్పటం మినహా ఫలితం కనిపించలేదు. మరోవైపు కౌలు, సాగు ఖర్చుల కోసం చేసిన అప్పులు తీర్చాలని రుణదాతల నుంచి ఒత్తిడి పెరగటంతో మనస్తాపానికి గురైన కరీం సాహెబ్ ఆదివారం పురుగుమందు తాగారు. కుటుంబసభ్యులు 108లో జగ్గయ్యపేట ఆసుపత్రికి తరలించారు. దీనిపై విచారించేందుకు తహసీల్దార్ వైకుంఠరావు ఆసుపత్రికి ఆర్ఐ శ్రీనివాసరావును పంపారు. కాగా, తమ తండ్రి ఇప్పటికే రెండుసార్లు ఆత్మహత్యకు యత్నించగా అడ్డుకున్నామని కరీం సాహెబ్ కుమారుడు రఫీ తెలిపారు.
రుణభారంతో రైతు ఆత్మహత్య
ప్రకాశం జిల్లా పర్చూరు మండలం నూతలపాడుకు చెం దిన చిర్రా వెంకటరెడ్డి(61)తన ఐదెకరాలతో పాటు రెండున్నర ఎకరాలు కౌలుకు తీసుకుని మి ర్చి సాగు చేశారు. వరుస తె గుళ్లు, ప్రకృతి ప్రతికూలతతో దిగుబడి రాలేదు. దీంతోపాటు పంటకు గిట్టుబాటు ధర కరువైంది. రుణదాతల ఒత్తిడి పెరగడంతో మనోవేదనకు గురైన వెంకటరెడ్డి ఈ నెల 20న ఇంట్లోనే పురుగుమందు తాగగా, గుంటూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. చికిత్స పొందుతూ శనివారం రాత్రి మృతి చెందారు.