సీతమ్మా.. ఎంత కష్టమొచ్చిందమ్మా!

ABN , First Publish Date - 2022-03-08T08:40:43+05:30 IST

ఆమె పేరు సీతమ్మ.. వయసు 70 ఏళ్లు.. నిరుపేదరాలు.. కదలలేదు.. నడవలేదు.. కూర్చోవడం కూడా కష్టమే! కాలకృత్యాలూ...

సీతమ్మా.. ఎంత కష్టమొచ్చిందమ్మా!

 నెలలుగా నిలిచిన దివ్యాంగుల పింఛన్‌

 మంచంపై మోసుకుంటూ 

కలెక్టరేట్‌కు.. స్పందనలో ఫిర్యాదు


కలెక్టరేట్‌ (విజయనగరం)/ నెల్లిమర్ల, మార్చి 7: ఆమె పేరు సీతమ్మ.. వయసు 70 ఏళ్లు.. నిరుపేదరాలు.. కదలలేదు.. నడవలేదు.. కూర్చోవడం కూడా కష్టమే! కాలకృత్యాలూ మంచంపైనే.. ఇలాంటి దయనీయ స్థితిలో ఉన్న ఆ వృద్ధురాలిని చూస్తే ఎవరికైనా కనికరం కలుగుతుంది. అధికారులకు మాత్రం చలనం లేదు. ఆమెకు మంజూరైన దివ్యాంగుల పింఛన్‌ ఎనిమిది నెలల క్రితం ఆగిపోతే ఆమె గోడు పట్టించుకోవడం లేదు. పింఛన్‌ సొమ్ముతోనే బతుకు వెళ్లదీస్తున్న సీతమ్మ ఆ ఆసరా కూడా ఆగిపోవడంతో.. పస్తులతో గడుపుతోంది. విజయనగరం జిల్లా నెల్లిమర్ల మండలం చంద్రంపేట పంచాయతీ తాళ్లపూడిపేట గ్రామానికి చెందిన సీతమ్మ కష్టాలను నిత్యం చూస్తున్న స్థానికులు చలించిపోయారు. దీర్ఘకాలిక సమస్యలతో మంచానికే పరిమితమైన ఆమెను మంచంపై మోసుకుంటూ సోమవారం ఉదయం కలెక్టరేట్‌లో స్పందనకు తీసుకొచ్చారు. ఆమెను మంచంపైనే ఉంచి కలెక్టర్‌ వద్దకు తీసుకెళ్లారు. ఆమె పడుతున్న బాధలను కలెక్టర్‌కు విన్నవించారు. 


విచారణకు రాలేదని పెండింగ్‌..

సీతమ్మకు 90శాతం అంగవైకల్యం ఉండడంతో గతంలో దివ్యాంగుల పింఛన్‌ మంజూరైందని, చాలాకాలం ప్రభుత్వ నిబంధనల ప్రకారం నెలకు రూ.3వేలు చెల్లించామని నెల్లిమర్ల ఎంపీడీవో కె.రాజ్‌కుమార్‌ తెలిపారు. ఆ తర్వాత అది మెడికల్‌ ఫించన్‌గా మారడంతో రూ.5వేలకు పెరిగిందన్నారు. అనంతరం మెడికల్‌ పింఛన్లపై విమర్శలు రావడంతో వైద్యాధికారులు అందరినీ విచారించారని, ఆ సమయంలో సీతమ్మ విచారణకు హాజరుకాలేదని చెప్పారు. దీంతో అప్పటినుంచి ఆమె పింఛన్‌ను పెండింగ్‌లో పెట్టామని వెల్లడించారు.

Updated Date - 2022-03-08T08:40:43+05:30 IST