AP PGCET నోటిఫికేషన్ విడుదల
ABN , First Publish Date - 2022-06-27T20:38:53+05:30 IST
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉన్నత విద్య మండలి - పోస్ట్ గ్రాడ్యుయేట్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్(ఏపీ పీజీసెట్) 2022 నోటిఫికేషన్ను విడుదల చేసింది. ఈ ఎగ్జామ్ను కడపలోని యోగి వేమన యూనివర్సిటీ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉన్నత విద్య మండలి - పోస్ట్ గ్రాడ్యుయేట్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్(ఏపీ పీజీసెట్) 2022 నోటిఫికేషన్ను విడుదల చేసింది. ఈ ఎగ్జామ్ను కడపలోని యోగి వేమన యూనివర్సిటీ నిర్వహిస్తోంది. ఇందులో సాధించిన మెరిట్ ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న యూనివర్సిటీలు సహా ప్రభుత్వ, ప్రైవేట్, అనుబంధ, మైనారిటీ కళాశాలల్లో పీజీ కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు. ఎంఏ, ఎంకాం, ఎమ్మెస్సీ, ఎంసీజే, ఎం.లైబ్రరీ సైన్స్, ఎంఈడీ, ఎంపీఈడీ, ఎమ్మెస్సీ టెక్నాలజీ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. దేశవ్యాప్తంగా ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. తెలుగు రాష్ట్రాలు మినహా ఇతర రాష్ట్రాల అభ్యర్థులకు ప్రతి కోర్సులో 5 శాతం సూపర్న్యూమరరీ సీట్లు ప్రత్యేకించారు.
అడ్మిషన్స్ ఇచ్చే యూనివర్సిటీలు: ఆంధ్ర, శ్రీ వేంకటేశ్వర, శ్రీ కృష్ణదేవరాయ, ఆచార్య నాగార్జున, శ్రీ పద్మావతి మహిళ, యోగి వేమన, రాయలసీమ, విక్రం సింహపురి, ద్రవిడియన్, కృష్ణ, ఆది కవి నన్నయ, డా.బీ.ఆర్.అంబేద్కర్, డా.అబ్దుల్ హక్ ఉర్దు, క్లస్టర్, ఆంధ్ర కేసరి టంగుటూరి ప్రకాశం, జేఎన్టీయూఏ - ఓటీపీఆర్ఐ
అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి సంబంధిత సబ్జెక్ట్లతో డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. బీకాం అభ్యర్థులు ఎంఏ ఎకనామిక్స్లో ప్రవేశానికి అనర్హులు. ఎంఏ(లాంగ్వేజెస్)లో ప్రవేశానికి బీఈ, బీటెక్, బీఫార్మసీ అభ్యర్థులు అనర్హులు.
ఏపీ పీజీసెట్ వివరాలు: ఇది కంప్యూటర్ బేస్డ్ టెస్ట్. దీనిని ఆబ్జెక్టివ్ విధానంలో నిర్వహిస్తారు. ఇందులో మొత్తం 100 మల్టిపుల్ చాయిస్ ప్రశ్నలు ఇస్తారు. అనాలజీస్, క్లాసిఫికేషన్, మ్యాచింగ్, కాంప్రహెన్షన్ ఆఫ్ రిసెర్చ్ స్టడీ, ఎక్స్పరిమెంటల్, థియరిటికల్ ప్రశ్నలు అడుగుతారు. పరీక్ష సిలబ్సను వెబ్సైట్లో చూడవచ్చు. ప్రశ్నకు ఒక మార్కు చొప్పున మొత్తం మార్కులు 100. పరీక్ష సమయం గంటన్నర. ఈ పరీక్షలో అర్హత సాధించాలంటే కనీసం 35 శాతం మార్కులు రావాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఈ నిబంధన వర్తించదు.
ఎంపీఈడీ కోర్సుకు మాత్రం అభ్యర్థులు క్రీడల్లో సాధించిన విజయాలను కూడా పరిగణనలోకి తీసుకుంటారు. దీనికి కూడా 100 మార్కులు కేటాయించారు. అభ్యర్థులు జాతీయ, అంతర్జాతీయ స్థాయుల్లో సాధించిన విజయాలకు సంబంధించిన సర్టిఫికెట్లను దరఖాస్తుకు జతచేయాలి.
ముఖ్య సమాచారం
దరఖాస్తు ఫీజు: జనరల్ అభ్యర్థులకు రూ.850; బీసీ అభ్యర్థులకు రూ.750; దివ్యాంగులు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రూ.650
ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: జూలై 20
ఏపీ పీజీసెట్ 2022 తేదీలు: ఆగస్టు 17 నుంచి
వెబ్సైట్: www.yvu.edu.in, https://cets.apsche.ap.gov.in