కేరళ, తమిళనాడులకు ఏపీ విత్తనాలు

ABN , First Publish Date - 2021-03-09T05:05:50+05:30 IST

కేరళ, తమిళనాడు రాష్ట్రాలకు ఏపీ సీడ్స్‌ విత్తనాలను ఎగుమతి చేస్తున్నామని ఆ సంస్థ రాష్ట్ర మేనేజింగ్‌ డైరెక్టర్‌ జి.శేఖర్‌బాబు తెలిపారు. సాలూరు మండలం జనవరివలసలో ఉన్న ఏపీసీడ్స్‌ ప్రాసెసింగ్‌ యూనిట్‌ను సోమవారం ఆయన పరిశీలించారు.

కేరళ, తమిళనాడులకు ఏపీ విత్తనాలు
జనవవరివలసలో ఏపీ సీడ్స్‌ యూనిట్‌ను పరిశీలిస్తున్న ఎమ్‌డీ శేఖర్‌ బాబు

ఏపీసీడ్స్‌ ఎమ్‌డీ శేఖర్‌బాబు

సాలూరు రూరల్‌, మార్చి 8: కేరళ, తమిళనాడు రాష్ట్రాలకు ఏపీ సీడ్స్‌ విత్తనాలను ఎగుమతి చేస్తున్నామని ఆ సంస్థ రాష్ట్ర మేనేజింగ్‌ డైరెక్టర్‌ జి.శేఖర్‌బాబు తెలిపారు. సాలూరు మండలం జనవరివలసలో ఉన్న ఏపీసీడ్స్‌ ప్రాసెసింగ్‌ యూనిట్‌ను సోమవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ కేరళ, తమిళనాడుకు అన్ని రకాలు కలిపి 15 వేల క్వింటాళ్లవిత్తనాలు ఎగుమతి చేస్తున్నామన్నారు. ప్రతి పార్లమెంట్‌ నియోజకవర్గంలో కనీసం ఒక ఏపీసీడ్స్‌ ప్రాసెసింగ్‌ యూనిట్‌ ఉండేలా కార్యాచరణ రూపొందించామని చెప్పారు. త్వరలో మరో 33 ప్రాసెసింగ్‌ యూనిట్ల నిర్మాణం చేపడతామన్నారు. ఈ ఏడాది నుంచి ఏపీసీడ్స్‌ ద్వారా కూరగాయల విత్తనాలను  అందించడానికి ప్రయత్నిస్తున్నామని వెల్లడించారు. రాష్ట్రంలో 2.80 లక్షల క్వింటాళ్ల వరి విత్తనాలు, 4.5 లక్షల క్వింటాళ్ల వేరుశనగ, 50 వేల క్వింటాళ్ల అపరాలు, 10 వేల క్వింటాళ్ల చిరుధాన్యాలు, లక్ష క్వింటాళ్ల కట్టె జనుము విత్తనాలను రైతులకు అందిస్తున్నామని వివరించారు. ఈ నెల నుంచి విత్తనాల ప్రాసెసింగ్‌ ప్రారంభించామని, మే నెల నాటికి రైతు భరోసా కేంద్రాల ద్వారా ఖరీఫ్‌ రైతులకు విత్తనాలు సిద్ధం చేస్తామని వెల్లడించారు. జనవరివలస ఏపీ సీడ్స్‌ యూనిట్‌లో సౌకర్యాలు మెరుగుపర్చడానికి మరో 41 సెంట్ల భూమిని కొనుగోలు చేశామన్నారు. జిల్లాలో 70 వేల క్వింటాళ్ల విత్తనాల్లో వరి విత్తనాలే 50 వేల క్వింటాళ్లు ఉన్నాయని వివరించారు. ఆయన వెంట ఏపీ సీడ్స్‌ సాలూరు మేనేజర్‌ బాలకృష్ణ, సాలూరు ఏవో వెంకటయ్య, ఏఈవో మరిపి బాబ్జీ తదితరులు ఉన్నారు. 


Updated Date - 2021-03-09T05:05:50+05:30 IST