బలిమెలలో ఏపీ వాటా 29.9 టీఎంసీలు

ABN , First Publish Date - 2022-09-28T06:34:36+05:30 IST

సీలేరు నదీ పరివాహక ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు బలిమెల జలాశయంలో ఏపీ వాటా 29.9 టీఎంసీలకు చేరిందని ఏపీ జెన్‌కో ఎస్‌ఈ కేకేవీ ప్రశాంత్‌కుమార్‌ తెలిపారు.

బలిమెలలో ఏపీ వాటా 29.9 టీఎంసీలు
విలేకరులతో మాట్లాడుతున్న ఎస్‌ఈ ప్రశాంత్‌కుమార్‌

రూ.5 లక్షలతో సీలేరు రెగ్యులేటర్‌ డ్యామ్‌ గేట్ల మరమ్మతు

ఏపీ జెన్‌కో సీలేరు కాంప్లెక్సు ఎస్‌ఈ ప్రశాంత్‌కుమార్‌


సీలేరు, సెప్టెంబరు 27: సీలేరు నదీ పరివాహక ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు బలిమెల జలాశయంలో ఏపీ వాటా 29.9 టీఎంసీలకు చేరిందని ఏపీ జెన్‌కో ఎస్‌ఈ కేకేవీ ప్రశాంత్‌కుమార్‌ తెలిపారు. మంగళవారం తన కార్యాలయంలో విలేకరులతో ఆయన మాట్లాడుతూ కొద్ది రోజులుగా ఆంధ్రా, ఒడిశా సరిహద్దుల్లో కురుస్తున్న వర్షాలతో జోలాపుట్టు, బలిమెల, డొంకరాయి జలాశయాల్లో భారీగా నీరు చేరిందన్నారు. దీంతో ప్రస్తుతం జోలాపుట్టులో  19.1 టీఎంసీలు, బలిమెలలో 35.3 టీఎంసీలు ఉన్నాయన్నారు. అయితే ఆంధ్రా కంటే ఇప్పటివరకు ఒడిశా అదనంగా 5.5  టీఎంసీలు వినియోగించుకుందని, దీంతో ప్రస్తుతం ఏపీ జెన్‌కో వాటా 29.9 టీఎంసీలు ఉందని ఎస్‌ఈ తెలిపారు. అలాగే సీలేరు (గుంటవాడ) జలాశయంలో 0.58 టీఎంసీలు, డొంకరాయిలో పది టీఎంసీలతో కలుపుకుని మొత్తంగా సీలేరు కాంప్లెక్సుకు 40.57 టీఎంసీలు(బలిమెల వాటా నీటితో కలుపుకుని) నీటి నిల్వలు ఉన్నాయన్నారు. ఈ నీటితో విద్యుత్‌ డిమాండ్‌కు అనుగుణంగా గ్రిడ్‌ అధికారుల ఆదేశాల మేరకు ఉత్పత్తి చేస్తున్నామన్నారు. ప్రస్తుతం సీలేరు కాంప్లెక్సుకు ఎటువంటి నీటి సమస్య తలెత్తదని ఆయన తెలిపారు. 


రూ.5 లక్షలతో గేట్ల మరమ్మతులు

సీలేరు జల విద్యుత్‌ కేంద్రానికి నీరు అందించే రెగ్యులేటర్‌ డ్యామ్‌ మూడు గేట్లు సాంకేతిక లోపాలు తలెత్తి తరచూ మరమ్మతులతో నీటి విడుదలకు ఆటంకం ఏర్పడుతున్నదని ఎస్‌ఈ ప్రశాంత్‌కుమార్‌ తెలిపారు. ఈ నేపథ్యంలో రూ.5 లక్షల వ్యయంతో ఒకటి, ఎనిమిది గేట్లకు రోప్‌లను మార్చుతున్నామన్నారు. అలాగే నాలుగు, ఐదు గేట్లకు రోలర్లను కూడా మార్చుతున్నట్టు ఎస్‌ఈ తెలిపారు.

Updated Date - 2022-09-28T06:34:36+05:30 IST