తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడి నియామకం

ABN , First Publish Date - 2021-01-12T06:49:30+05:30 IST

తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడిగా మదనపల్లెకు చెందిన గుండ్లపల్లె శ్రీరామ్‌ చినబాబు నియమితులయ్యారు.

తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడి నియామకం
శ్రీరామ్‌ చినబాబు

అంగళ్ళు ఘటనతో అధినేత చంద్రబాబు దృష్టి

మదనపల్లెలో అనూహ్యంగా బలపడనున్న టీడీపీ 


తిరుపతి, జనవరి 11 (ఆంధ్రజ్యోతి): తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడిగా మదనపల్లెకు చెందిన గుండ్లపల్లె శ్రీరామ్‌ చినబాబు నియమితులయ్యారు. చడీ చప్పుడు లేకుండా పార్టీ అధినేత చంద్రబాబు తీసుకున్న ఈ నిర్ణయం జిల్లాలోని పశ్చిమ ప్రాంతంలో ప్రత్యేకించి మదనపల్లె నియోజకవర్గంలో రాజకీయ సమీకరణలను తారుమారు చేయనుందనే చెప్పాలి. బీసీలకు తొలినుంచీ ప్రాధాన్యత ఇస్తున్న పార్టీగా టీడీపీకి వున్న ముద్రను అధినేత మరోసారి నిజం చేశారు. మదనపల్లె పట్టణం నీరుగట్టువారిపల్లెకు చెందిన గుండ్లపల్లె శ్రీరామ్‌ చినబాబు గతంలో కాంగ్రెస్‌ పార్టీలో వుండి మదనపల్లె వ్యవసాయ మార్కెట్‌ కమిటీకి ఛైర్మన్‌గా పనిచేశారు. చేనేత సామాజికవర్గానికి చెందిన ఇతడికి పట్టణంలో పెద్ద సంఖ్యలో వున్న ఆ వర్గీయులపై చెప్పుకోదగ్గ పట్టు వుంది. ముఖ్యంగా ఆ వర్గంలో  యువత గణనీయ సంఖ్యలో అతడి వెన్నంటి వుంది. కాంగ్రెస్‌ నుంచీ తరువాత టీడీపీలో చేరినప్పటికీ స్థానిక రాజకీయాల కారణంగా అతడికి పెద్ద ప్రాధాన్యత లభించలేదు. అయితే అంగళ్ళు ఘటనలో వైసీపీ వర్గీయులు జరిపిన దాడిలో చినబాబు వాహనం కూడా ధ్వంసమైంది. ఈ విషయాన్ని పార్టీ ముఖ్యనేత నల్లారి కిషోర్‌కుమార్‌రెడ్డి అధినేత దృష్టికి తీసుకెళ్ళారు. దీంతో చంద్రబాబు అతడికి ఫోన్‌ చేసి నేరుగా మాట్లాడి ధైర్యం చెప్పారు. ఆ సందర్భంగా అధినేత ఆరా తీయడంతో మదనపల్లె నియోజకవర్గంలో కీలక సామాజికవర్గానికి చెందిన నాయకుడని, ఆ వర్గంపై పట్టు కలిగి, నియోజకవర్గంలో విస్తృత పరిచయాలున్నాయని తెలియడంతో పార్టీలో ప్రాధాన్యత ఇవ్వాలని అప్పుడే నిర్ణయించారు.ఆ బాధ్యతను రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడికి అప్పగించారు.ఈ విషయంలో జిల్లా టీడీపీలో స్వల్పంగా అభ్యంతరాలు తలెత్తినా స్వయంగా అధినేతే జోక్యం చేసుకోవడంతో సద్దుమణిగిపోయాయి. వాస్తవానికి డిసెంబరులోనే నియామకం జరగాల్సి వుండగా రాష్ట్రంలోని రాజకీయ పరిణామాలతో చంద్రబాబు బిజీ కావడంతో ఇంత ఆలస్యమైంది. ఇప్పటికే పశ్చిమ ప్రాంతానికి చెందిన నల్లారి కిషోర్‌, అమరనాధరెడ్డి, మద్దిపట్ల సూర్యప్రకాష్‌ తదితరులకు పార్టీలో కీలక బాధ్యతలు అప్పగించడంతో ఆ డివిజన్‌ పరిధిలో టీడీపీ గతంలో కంటే మరింత క్రియాశీలమైన సంగతి తెలిసిందే. అధినేత తాజాగా చేపట్టిన తెలుగు యువత నియామకం ఆ డివిజన్‌తో పాటు ప్రత్యేకించి మదనపల్లె నియోజకవర్గంలో పార్టీ అనూహ్యంగా బలపడేలా చేసింది.

Updated Date - 2021-01-12T06:49:30+05:30 IST