పీటీడీలో ఎన్నికల సందడి
ABN , First Publish Date - 2021-12-06T05:17:26+05:30 IST
ఆంధ్రప్రదేశ్ ప్రజా రవాణా సంస్థ(ఏపీపీటీడీ)లో క్రెడిట్ కో–ఆపరేటివ్ సొసైటీ ఎన్నికల సందడి నెలకొంది.
14న కో–ఆపరేటివ్ సొసైటీ ఎన్నికలు
ఓటు వేయనున్న 2,430 మంది ఉద్యోగులు
8 డిపోలు.. 9 మంది ప్రతినిధులు
నేటితో ముగియనున్న నామినేషన్ ప్రక్రియ
ఏలూరు, డిసెంబరు 5 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్ ప్రజా రవాణా సంస్థ(ఏపీపీటీడీ)లో క్రెడిట్ కో–ఆపరేటివ్ సొసైటీ ఎన్నికల సందడి నెలకొంది. గత నెల 29న మొదలైన నామినేషన్ల ప్రక్రియ సోమవారంతో ముగుస్తుంది. 7 నుంచి పదో తేదీలోగా నామినేషన్ల ఉప సంహరణ, 14న పోలింగ్ నిర్వహిస్తారు. జిల్లాలోని ఏలూరు, భీమవరం, జంగారెడ్డిగూడెం, కొవ్వూరు, నిడదవోలు, నరసాపురం, తాడేపల్లిగూడెం డిపోల్లో వున్న 2,430 మంది సొసైటీ సభ్యులు తొమ్మిది మందిని తమ ప్రతినిధులుగా ఎన్నుకుంటారు. ఇవి గుర్తింపు సంఘం ఎన్నికలు కానందున, యూనియన్ల గుర్తుల మీద కాకుండా అభ్యర్థుల పేర్లుపైనే ఎన్నికలు జరుగుతాయి. అయినప్పటికీ ఎన్ఎంయూ–ఎస్డబ్ల్యూఎఫ్, ఈయూ, బహుజన కార్మిక ఫెడరేషన్ వంటి ప్రధాన యూనియన్లు తమ అభ్యర్థుల నామినేషన్ ప్రక్రియను పూర్తి చేసుకుని ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. ఈ నెల 14న ఎన్నికలు నిర్వహించి, అదేరోజు ఓట్లను లెక్కించి, గెలుపొందిన అభ్యర్థులను ప్రతినిధులుగా ప్రకటిస్తారు. రాష్ట్రవ్యాప్తంగా 210 మంది ప్రతినిధులు అదేరోజు ఎన్నికవుతారు. వీరంతా ఈ నెల 29న సమావేశమై తొమ్మిది మందితో కూడిన సీసీఎస్ నూతన పాలక మండలిని ఎన్నుకుంటారు. క్రెడిట్ కో–ఆపరేటివ్ సొసైటీ ఉద్యోగుల పిల్లల చదువులకు రుణాలు అందించడంతోపాటు, వీరు పొదుపు చేసే డబ్బులపై పది శాతం మేర వడ్డీ ఇస్తోంది.