పాకిస్థాన్ పై అరబ్‌ల ఆగ్రహం

ABN , First Publish Date - 2020-12-09T19:41:29+05:30 IST

గల్ఫ్ దేశాలలో భారతీయులకు అన్నింటా ప్రధాన పోటీదారులు పాకిస్థానీయులే. అయితే, వారు తమ ప్రభావాన్ని క్రమేణా కోల్పోతూ అవకాశాలను అందిపుచ్చుకోవడంలో వెనుకబడిపోతున్నారు. గల్ఫ్ దేశాలలో, సగటు కార్మికుడి నుంచి మేనేజ్‌మెంట్ ఎగ్జిక్యూటివ్ వరకు అన్నిస్థాయిలలో...

పాకిస్థాన్ పై అరబ్‌ల ఆగ్రహం

గల్ఫ్ దేశాలలో భారతీయులకు అన్నింటా ప్రధాన పోటీదారులు పాకిస్థానీయులే. అయితే, వారు తమ ప్రభావాన్ని క్రమేణా కోల్పోతూ అవకాశాలను అందిపుచ్చుకోవడంలో వెనుకబడిపోతున్నారు. గల్ఫ్ దేశాలలో, సగటు కార్మికుడి నుంచి మేనేజ్‌మెంట్ ఎగ్జిక్యూటివ్ వరకు అన్నిస్థాయిలలో భారతీయులు, పాకిస్థానీయుల మధ్య పోటీ కద్దు. భారతీయులతో పోల్చితే పాకిస్థానీయుల విద్యార్హతలు, వృత్తి నైపుణ్యాలు అధికమైనవి, ఉన్నతమైనవి కావు. అయినప్పటికీ మనవారితో వారు బాగా పోటీపడేవారు. గల్ఫ్‌లోని ఆరు దేశాలలో ఎక్కడైనా సరే పాకిస్థానీయులు తమ బంధువుల ఇంటికి వచ్చినట్లుగా వ్యవహరించడం పరిపాటి. పాకిస్థాన్‌కు, ఈ ఎడారి దేశాలకు మధ్య ఉన్నతస్థాయి రాజకీయ, సైనిక సంబంధాలు ఉండడమే అందుకు కారణమని చెప్పవచ్చు. 


పాక్ పౌర పాలకుల కంటే సైనిక పాలకులే ఈ సన్నిహిత సంబంధాల నిర్మాణంలో కీలకపాత్ర వహించారు. ప్రచ్ఛన్నయుద్ధ కాలంలో కుదిరిన ఒక సైనిక సహాయక ఒప్పందం గల్ఫ్ దేశాలతో ఇస్లామాబాద్ సన్నిహిత ద్వైపాక్షిక సంబంధాలకు పునాది. అఫ్ఘానిస్థాన్‌లో అమెరికా, గల్ఫ్ దేశాల సహాయంతో జిహాద్‌ను పెంచిపోషించగా అందుకు పాకిస్థాన్ వేదిక అయింది. ఈ రాజకీయ నేపథ్యం పాకిస్థానీయుల ఆభిజాత్యానికి ఆలంబన అయింది. సోవియట్ యూనియన్ విచ్ఛిన్నమైన తర్వాత అఫ్ఘానిస్తాన్‌లో జిహాదీ ఉగ్రమూకలకు అమెరికా సహాయం నిలిపివేసింది. మరో వైపు గత రెండు దశాబ్దాలుగా భారత్‌లో శరవేగంగా పెరుగుతున్న చమురు వినియోగం గల్ఫ్ దేశాల ఆలోచనా విధానంలో మార్పు తీసుకువచ్చింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఆయన జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్‌ల దౌత్య ప్రజ్ఞతో గల్ఫ్ దేశాలతో భారత్ ద్వైపాక్షిక సంబంధాలు ఇతోధికంగా మెరుగుపడ్డాయి. కశ్మీర్ విషయంలో దశాబ్దాలుగా పాకిస్థాన్‌కు అండగా ఉన్న గల్ఫ్ దేశాలు, ప్రత్యేకించి యునైటెడ్ అరబ్ ఏమిరేట్స్, సౌదీ అరేబియాలు తమ వైఖరిని మార్చుకున్నాయి. కశ్మీర్ ప్రత్యేక ప్రతిపత్తిని రద్దు చేయడంపై ఇస్లామిక్ దేశాల సమాఖ్య (ఓ.ఐ.సి) ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించాలన్న పాకిస్థాన్ విజ్ఞప్తిని సౌదీ అరేబియా పట్టించుకోలేదు. ఇస్లామిక్ దేశాలలో నాయకత్వం కోసం సౌదీ అరేబియాతో పోటీపడుతున్న టర్కీ, ఇంకా ఇతర దేశాలతో కలిసి తాము వేరుగా సమావేశం నిర్వహిస్తామని చెప్పడం ద్వారా సౌదీ అరేబియా నాయకత్వాన్ని పాకిస్థాన్ ప్రశ్నించింది. తమ పౌర ప్రభుత్వం చేసిన ఈ తప్పిదాన్ని సరి దిద్దేందుకు సైనిక దళాల ప్రధానాధికారి జనరల్ ఖమర్ జావేద్ బాజ్వా సౌదీ అరేబియా యువరాజుతో సమావేశం కావడానికి రియాద్కు వచ్చారు.


అయితే ఈ సమావేశం జరగలేదు. ఇజ్రాయేల్‌తో దౌత్య సంబంధాల విషయమై యు.ఏ.ఇ. పై పాక్ కొన్ని తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ఈ కారణాన యుఏఇ నాయకత్వం పాకిస్థాన్పై ఆగ్రహంతో ఉంది. ఇచ్చిన అప్పును తీర్చమని సౌదీ అరేబియా ఒత్తిడి చేస్తుండగా, పాకిస్థాన్‌కు నూతన వీసాల జారీని యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ నిలిపివేసింది. యుఏఇ చర్య పాకిస్థాన్ ఆర్థిక పట్టుగొమ్మలను విరిచింది.


భారతీయులు తమ వృత్తి నైపుణ్యాలు, విధుల పట్ల నిబద్ధత, అంకిత భావం, అంతకు మించి స్నేహపూర్వక స్వభావం కారణాన తమకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు పొందారు. ఇది కూడా బ్రాండ్ ఇండియా ప్రమోషన్‌కు విశేషంగా దోహదపడింది. ఈ నేపథ్యంలో ఇటీవల విదేశీ వ్యవహారాల మంత్రి జైశంకర్ బహ్రెయిన్, యునైటెడ్ అరబ్ ఏమిరేట్స్ దేశాలలో పర్యటించారు. భారతీయ సైన్యాధిపతి జనరల్ ఎం.ఎం. నార్వనే త్వరలో సౌదీ అరేబియా, యుఏఇ లలో పర్యటించనున్నారు. భారత్ పట్ల అరబ్ దేశాల వైఖరి ఇలా సానుకూలంగా మారడానికి న్యూఢిల్లీ పాలకుల దౌత్య ధురీణతే ప్రధాన కారణమని చెప్పక తప్పదు. 


మొహమ్మద్ ఇర్ఫాన్

ఆంధ్రజ్యోతి గల్ఫ్ ప్రతినిధి

Updated Date - 2020-12-09T19:41:29+05:30 IST