‘గుట్కా’సురులు!
ABN , First Publish Date - 2021-06-14T04:31:56+05:30 IST
గుట్కా, ఖైనీ జిల్లాలో నిషేధిత వస్తువులు. కానీ జిల్లాలో యథేచ్ఛగా చలామణి అవుతున్నారు. జోరుగా క్రయ విక్రయాలు సాగుతున్నాయి. గ్రామాలు, పట్టణాలు అన్న తేడా లేకుండా అన్నిచోట్ల దొరుకుతున్నాయి. రోజుకు సగటున లక్షలాది రూపాయల వ్యాపారం సాగుతోంది. అధికారులు, పోలీసుల కళ్లుగప్పి మరీ ఒడిశా నుంచి దిగుమతి చేసుకుంటున్నారు.
జిల్లాలో యథేచ్ఛగా గుట్కా, ఖైనీ విక్రయాలు
ఒడిశా నుంచి రైళ్ల ద్వారా రవాణా
పొందూరు రైల్వేస్టేషన్ ద్వారా జిల్లాలోకి..
పట్టించుకోని అధికారులు
బరితెగిస్తున్న అక్రమార్కులు
(పొందూరు)
జిల్లాలో నిషేధిత గుట్కా, ఖైనీ వ్యాపారం జోరుగా సాగుతోంది. ముఖ్యంగా పక్కనే ఉన్న ఒడిశా నుంచి రోడ్డు, రైలు మార్గం గుండా వీటి నిల్వలను జిల్లాకు చేర్చుతున్నారు. పట్టణ, గ్రామీణ ప్రాంతాలకు తరలిస్తున్నారు. ప్రభుత్వం వీటిని నిషేధించినట్టు చెప్పుకొస్తున్నా...చిన్నపాటి దుకాణాల్లో సైతం లభిస్తున్నాయి. వీటి నియంత్రణకు నియమించిన స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో తూతూమంత్రపు దాడులకే పరిమితమవుతుందన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
-గుట్కా, ఖైనీ జిల్లాలో నిషేధిత వస్తువులు. కానీ జిల్లాలో యథేచ్ఛగా చలామణి అవుతున్నారు. జోరుగా క్రయ విక్రయాలు సాగుతున్నాయి. గ్రామాలు, పట్టణాలు అన్న తేడా లేకుండా అన్నిచోట్ల దొరుకుతున్నాయి. రోజుకు సగటున లక్షలాది రూపాయల వ్యాపారం సాగుతోంది. అధికారులు, పోలీసుల కళ్లుగప్పి మరీ ఒడిశా నుంచి దిగుమతి చేసుకుంటున్నారు. ఇదో లాభసాటి వ్యాపారంగా మారడంతో రోజురోజుకు వ్యాపార లావాదేవీలు పెరుగుతున్నాయి. కొవిడ్ ఆంక్షల నేపథ్యంలో సరిహద్దు ప్రాంతాల్లో చెక్పోస్టులు వెలియడంతో అక్రమ వ్యాపారులు రైలుమార్గాన్ని ఎంచుకుంటున్నారు. చిన్న చిన్న రైల్వేస్టేషన్ల వద్ద నిల్వలను దించుతూ చీకటి మార్గంలో గ్రామీణ, పట్టణ ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఇటీవల పోలీస్, ఎస్ఈబీ దాడుల్లో పెద్దఎత్తున నిల్వలు పట్టుబడుతుండడం దీనిని తేటతెల్లం చేస్తోంది.
ఏజెంట్ల ద్వారా తరలింపు
పొందూరు రైల్వేస్టేషన్ గుట్కా, ఖైనీ రవాణాకు అడ్డాగా మారింది. చిన్న రైల్వేస్టేష న్ కావడంతో అధికారుల దృష్టి పెద్దగా ఉండదు. అటు శ్రీకాకుళం జిల్లా కేంద్రంతో పాటు విజయనగరం జిల్లాలోని పట్టణాలకు దగ్గర మార్గం కావడంతో అక్రమా ర్కులు ఈ రైల్వేస్టేషన్ను ఎంచుకుంటున్నారు. భువనేశ్వర్, బరంపూర్ నుంచి నిల్వలను నేరుగా తేవడం, ఇక్కడ నుంచి ముందస్తుగా మాట్లాడుకునే ఏజెంట్ల ద్వారా తరలించడం పరిపాటిగా మారింది. జి.సిగడాం, లావేరు, రణస్థలం, సంతకవి టి, ఎచ్చెర్ల, రాజాం, చీపు రుపల్లి, పూసపాటిరేగ, డెంకాడ మండలాల వరకూ తరలిస్తున్న గుట్కా, ఖైనీలకు పొందూరు రైల్వేస్టేషన్ రాజమార్గంగా నిలుస్తోంది.
అధిక ధరకు విక్రయాలు
జనాల అవసరాలను, వ్యసనాన్ని ఆసరాగా చేసుకొని గుట్కా, ఖైనీలను అధిక ధరలకు విక్రయిస్తున్నారు. ప్యాకెట్ ను మూడు రెట్లు పెంచి అమ్ముతున్నారు. కొందరు వ్యాపారులు ఇళ్ల వద్ద నిల్వచేసి మరీ విక్రయిస్తున్నారంటే పరిస్థితి అర్ధం చేసుకోవచ్చు. కొంతమంది యువకులు గుట్కా, ఖైనీల బారినపడి భవిష్యత్ను నాశనం చేసుకుంటున్నారు. అనారోగ్యానికి గరవుతున్నారు. వారిని టార్గెట్ చేసుకునే ప్రధాన జంక్షన్లు, దుకాణాల్లో ప్రత్యేకంగా విక్రయిస్తున్నారు. నిషేధిత వస్తువుల రవాణా ను నియంత్రించేందుకు ఏర్పాటుచేసిన స్పెషల్ ఎన్ఫోర్స్ మెంట్ బ్యూరో నామమాత్రపు దాడులకే పరిమితమవు తోంది. దీనిపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికైనా దృష్టిసారించాల్సిన అవసరముంది. ప్రధానంగా రైల్వేస్టేషన్ల వద్ద నిఘా పెంచితే ప్రయోజనముంటుంది.
నిఘా పెట్టాం
గుట్కా, ఖైనీ రవాణా, విక్రయాలు జిల్లాలో నిషేధం. ప్రత్యేక నిఘా పెట్టాం. ఒడిశా నుంచి దిగుమతి చేస్తున్నట్టు సమాచారం ఉంది. రైళ్ల రాకపోకలపై దృష్టిపెట్టాం. కఠిన చర్యలు తీసుకుంటాం. అవసరమైతే క్రిమినల్ కేసులు నమోదుచేస్తాం.
-ఎస్.లక్ష్మణరావు, ఎస్ఐ, పొందూరు