ఏకలవ్య పాఠశాలకు ఆర్డీవో స్థల పరిశీలన
ABN , First Publish Date - 2021-06-22T05:46:03+05:30 IST
మండలానికి మంజూరైన ఏకలవ్య పాఠశాల భవనాల నిర్మాణాలకు కేటాయించిన స్థలాలను ఆర్డీవో శివజ్యోతి సోమవారం పరిశీలించారు.
గ్రామస్థులకు నచ్చజెప్పిన శివజ్యోతి
కొయ్యూరు, జూన్ 21: మండలానికి మంజూరైన ఏకలవ్య పాఠశాల భవనాల నిర్మాణాలకు కేటాయించిన స్థలాలను ఆర్డీవో శివజ్యోతి సోమవారం పరిశీలించారు. బాలారం పంచాయతీలోని సర్వే నంబరు 165, 167లో గల 18 ఎకరాలను స్థానిక రెవెన్యూ అధికారులు ఏకలవ్య పాఠశాలకు కేటాయించారు. అయితే ఆ భూమి మార్గదర్శకాలకు విరుద్ధంగా ఉండడంతో ఆర్డీవో శివజ్యోతి బాలారం గ్రామాన్ని సందర్శించారు. అలాగే ఏకలవ్య నిర్మాణాలకు అవసరమైన ప్రభుత్వ భూమి ఇదే సర్వే నంబర్లలో ఉండడంతో ఆర్డీవో వాటిని పరిశీలించారు. అలాగే ఈ భూమిని కొన్ని దశాబ్దాలుగా గిరిజనేతరులు సాగు చేసుకుంటూ జీవనోపాధి పొందుతున్నారు. ఈ భూమిని ఏకలవ్య పాఠశాలకు కేటాయిస్తే తమ జీవనోపాధి పోతుందని, తమకు ప్రత్యామ్నాయం కల్పించేలా ఆలోచించాలంటూ గిరిజనేతరులు మొరపెట్టుకున్నారు. దీనిపై ఆర్డీవో సాగు రైతులతో చర్చించగా.. అక్కడి పరిస్థితులను గ్రామ పెద్దలు వివరించారు. అనంతరం వారికి నచ్చచెప్పి ఏకలవ్యకు కేటాయించిన భూమిలోనే నిర్మాణాలు చేపట్టించేలా నిర్ణయించి భూవివరాలతో కూడిన పూర్వపు రికార్డులు తనకు అందజేయాలని స్థానిక రెవెన్యూ అధికారులను ఆదేశించారు. ఆమె వెంట తహసీల్దారు తిరుమలరావు, సర్వేయర్ సత్యనారాయణ, వీఆర్వో కుమారి, తదితరులు పాల్గొన్నారు.