వస్తున్నామా.. వెళ్తున్నామా!

ABN , First Publish Date - 2022-09-29T04:20:33+05:30 IST

పలాస మున్సిపాలిటీలో వైసీపీ పాలకవర్గం కొలువుదీరి ఏడాదైంది. పనులు కావడంలేదంటూ సొంతపార్టీ సభ్యులే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

వస్తున్నామా.. వెళ్తున్నామా!
సభ నుంచి వెళ్లిపోతున్న కౌన్సిలర్‌ సుజాత

సభలు.. టీ, సమోసా కోసమేనా?
అభివృద్ధి పనులు చేపట్టరా?
వైసీపీ సభ్యురాలి మండిపాటు
పలాస, సెప్టెంబరు 28:
‘కొత్త కౌన్సిల్‌ బాడీ ఏర్పడి ఏడాది పూర్తయింది. ఇప్పటివరకూ వార్డులో ఒక్క అభివృద్ధి పని కూడా చేయించలేకపోయాం. వస్తున్నామా.. వెళ్తున్నామా అన్నరీతిలో సభ సాగుతోంది. టీ, సమోసా కోసమే సమావేశం నిర్వహిస్తున్నట్టు ఉంది’.. వైసీపీకి చెందిన కౌన్సిలర్‌ ఆగ్రహం ఇది. పలాస మున్సిపాలిటీలో వైసీపీ పాలకవర్గం కొలువుదీరి ఏడాదైంది. పనులు కావడంలేదంటూ సొంతపార్టీ సభ్యులే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో బుధవారం నిర్వహించిన మునిసిపల్‌ సర్వసభ్య సమావేశంలో రెండో వార్డు కౌన్సిలర్‌(వైసీపీ) బడగల సుజాత వ్యాఖ్యలు చర్చనీయాంశం అయ్యాయి. ‘మా వార్డు పరిధి సూదికొండలో పవర్‌ బోర్లు వేయాలని ఎన్నిసార్లు అడుగుతున్నా.. అధికారులు పట్టించుకోవడం లేదు. కనీసం పారిశుధ్య పనులు కూడా చేపట్టడం లేదు’ అని సుజాత ఆవేదన వ్యక్తం చేశారు. సమావేశం నుంచి తాను వాకౌట్‌ చేస్తున్నట్లు ప్రకటించి బయటకు వెళ్లిపోయారు. ఐదో వార్డు కౌన్సిలర్‌(వైసీపీ) కర్రి మాధవరావు మాట్లాడుతూ వార్డుల్లో ఒక్కపని కూడా జరగడం లేదని, పనులు చేయలేని సమావేశాలు ఎందుకని ప్రశ్నించారు. మూడు నెలల నుంచి బోరు వేసినా దానికి మోటారు బిగించలేదని, ప్రశ్నిస్తుంటే అదిగో.. ఇదిగో అంటూ కాలయాపన చేస్తున్నారని విచారం వ్యక్తం చేశారు.

 

Updated Date - 2022-09-29T04:20:33+05:30 IST