చోరీ కేసుల్లో నిందితుల అరెస్టు
ABN , First Publish Date - 2022-06-29T06:00:39+05:30 IST
పల్నాడు జిల్లా వినుకొండ, నకరికల్లు, రొంపిచర్ల, ప్రకాశం జిల్లా కురిచేడు తదితర ప్రాంతాల్లో దొంగతనాలకు పాల్పడిన నలుగురు నిందితులను అరెస్టు చేసినట్లు ఎస్పీ రవిశంకర్రెడ్డి తెలిపారు.
బంగారం, నగదు స్వాధీనం
నరసరావుపేట లీగల్, జూన్ 28: పల్నాడు జిల్లా వినుకొండ, నకరికల్లు, రొంపిచర్ల, ప్రకాశం జిల్లా కురిచేడు తదితర ప్రాంతాల్లో దొంగతనాలకు పాల్పడిన నలుగురు నిందితులను అరెస్టు చేసినట్లు ఎస్పీ రవిశంకర్రెడ్డి తెలిపారు. మంగళవారం ఆయన కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ బొల్లాపల్లి మండలం గాటితండా గ్రామానికి చెందిన మూడావత్ చిన బ్రహ్మనాయక్, భూక్యా వెంకటేశ్వర్లు, కొప్పుకొండ తండాకు చెందిన భూక్యా తులసీ నాయక్, సోమలవాగు తండాకు చెందిన శివా నాయక్ ను అరెస్టు చేసినట్లు తెలిపారు. వారి వద్ద నుంచి 338 గ్రాముల బంగారం, 333 గ్రాముల వెండి, రూ.1.68 లక్షలు నగదు, నాలుగు మోటారు సైకిళ్లను రికవరీ చేసినట్టు తెలిపారు. చిన బ్రహ్మనాయక్పై 36 దొంగతనాల కేసులు, వెంకటేశ్వర్లు నాయక్పై వివిధ పోలీసుస్టేషన్లలో 28 చోరీకేసులు నమోదైనట్లు పేర్కొన్నారు. నిందితులను వినుకొండ సీఐ ఆధ్వర్యంలో ఎస్ఐలు చెన్నకేశవువులు, రాజ్యలక్ష్మి, సీసీఎస్ సీఐ విజయకృష్ణ బృందం అందించిన సాంకేతిక సాయంతో వినుకొండలో అదుపులోకి తీసుకున్నట్టు తెలిపారు. ఈ సందర్భంగా నిందితులను చాకచక్యంగా అదుపులోకి తీసుకొని అరెస్టు చేసిన వినుకొండ సీఐ బృందాన్ని, సీసీఎస్ సీఐ విజయకృష్ణ బృందాన్ని, సాంకేతిక సాయం అందించిన బృందాన్ని ఎస్పీ రవిశంకర్రెడ్డి నగదు రివార్డులతో అభినందించారు. సమావేశంలో జిల్లా పరిపాలన అదనపు ఎస్పీ బిందు మాధవ్, వినుకొండ సీఐ అశోక్కుమార్, సీసీఎస్ సీఐ విజయకృష్ణ, ఎస్ఐలు చరణ్, చెన్నకేశవులు, రాజ్యలక్ష్మి, సిబ్బంది పాల్గొన్నారు.