వెయ్యి ఆక్సిజన్ బెడ్లు ఏర్పాటు చేయండి
ABN , First Publish Date - 2021-05-10T05:11:40+05:30 IST
జిల్లాలో రోజురోజుకూ కరోనా కేసులు, మరణాలు పెరుగుతున్న నేపథ్యంలో తక్షణమే 1000 ఆక్సిజన్ బెడ్ల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని సీఐటీయూ నాయకులు అప్పలసూరి, టీవీ రమణ డిమాండ్ చేశారు.
విజయనగరం (ఆంధ్రజ్యోతి) మే 9 : జిల్లాలో రోజురోజుకూ కరోనా కేసులు, మరణాలు పెరుగుతున్న నేపథ్యంలో తక్షణమే 1000 ఆక్సిజన్ బెడ్ల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని సీఐటీయూ నాయకులు అప్పలసూరి, టీవీ రమణ డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆదివారం మంత్రి బొత్స సత్యనారాయణకు బహిరంగ లేఖ రాశారు. జిల్లా కేంద్రంలోని ప్రజా సంఘాల భవనంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో వారు మాట్లాడుతూ... కొవిడ్ బాధితులు అత్యధికులు ఆక్సిజన్ అందక చనిపోతున్నారన్నారు. పది రోజుల వ్యవధిలో రెండు సార్లు జిల్లా కేంద్రాసుపత్రిలో ఆక్సిజన్ సరఫరాకు అంతరాయం ఏర్పడిందని తెలిపారు. ప్రైవేట్ , ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఆక్సిజన్ బెడ్ల కొరత తీవంగా ఉందని, ఈ సమస్యను సత్వరమే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. జిల్లాలో కొవిడ్ ఆసుపత్రుల సంఖ్య పెంచాలని, ప్రతి నియోజకవర్గానికి 50 పడకలతో కూడిన ఆక్సిజన్ బెడ్లను ఏర్పాటు చేయాలని కోరారు. కొవిడ్ టెస్ట్ ఫలితాలు 24 గంటల్లో వచ్చేటట్లు చర్యలు చేపట్టాలన్నారు. డిమాండ్కు తగ్గట్లుగా జిల్లాకు వ్యాక్సిన్ సరఫరా చేసి ఇంటింటికీ వెళ్లి టీకా వేయాలన్నారు. పార్వతీపురం, ఎస్.కోట ఏరియా ఆసుపత్రుల్లో పడకల సంఖ్య పెంచాలని , పూర్తిస్థాయిలో డాక్టర్లు, టెక్నీషియన్లు, ఇతర వైద్య సిబ్బందిని నియమించాలని విజ్ఞప్తి చేశారు. కొవిడ్ విధుల్లో ఉన్న ఉద్యోగులు, సిబ్బందికి రూ.50లక్షల బీమా చేయాలని, అవసరమైన పీపీఈ కిట్లు సమకూర్చాలని లేఖలో పేర్కొన్నారు. సీఐటీయూ ప్రతినిధులు బోరు రవణ, రవికూమార్ తదితరులు పాల్గొన్నారు.