ధాన్యం కొనుగోళ్లకు ఏర్పాట్లు
ABN , First Publish Date - 2021-10-19T06:28:02+05:30 IST
జిల్లాలో ఖరీఫ్ సీజన్కు సంబంధించి ధాన్యం సేకరణపై యంత్రాంగం దృష్టి సారించింది.
ప్రతి ఆర్బీకే పరిధిలో కొనుగోలు కేంద్రం
రైతులు అక్కడ పేర్లు నమోదు చేసుకోవాలి
ఒంగోలు(జడ్పీ), అక్టోబరు 18: జిల్లాలో ఖరీఫ్ సీజన్కు సంబంధించి ధాన్యం సేకరణపై యంత్రాంగం దృష్టి సారించింది. ఈ దఫా జిల్లాలో ఉన్న అన్ని ఆర్బీకేల పరిధిలో కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు చర్యలు చేపడుతోంది. గడచిన రబీ సీజన్లో ధాన్యం సేకరణకు రెండు, మూడు ఆర్బీకేలకు కలిపి ఒక కొనుగోలు కేంద్రాన్ని అధికారులు ఏర్పాటుచేశారు. ఈ సీజన్లో వాటి సంఖ్యను పెంచనున్నారు. అందుకు అవసరమైన కసరత్తు ప్రారంభించారు. కొనుగోలుకు సంబంధించి ఇప్పటికే ప్రభుత్వం మార్గదర్శకాలను విడుదల చేసింది. తేమ శాతంతోపాటు, ఇతర అంశాలపై రైతులకు అవగాహన కల్పించేలా చర్యలు చేపట్టాలని యంత్రాంగానికి సూచించింది.
ఖరీఫ్లో 75వేల ఎకరాల్లో వరి సాగు
ప్రస్తుత ఖరీఫ్లో 75వేల ఎకరాలలో వరిసాగు చేపట్టినట్లు వ్యవసాయ శాఖ అంచనా. ఈ సీజన్కు సంబంధించి పౌరసరఫరాల శాఖ 65,000 టన్నుల ధాన్యాన్ని సేకరించాలని లక్ష్యంగా నిర్దేశించుకుంది. ఇప్పటి వరకు ఈ-పంటలో 62,500 ఎకరాల వరకు నమోదైంది. ధాన్యాన్ని ప్రభుత్వం ఏర్పాటుచేసిన కొనుగోలు కేంద్రాలలో అమ్ముకోవాలంటే అన్నదాతలు తప్పనిసరిగా ఈ-పంటలో తమ సాగు వివరాలను నమోదు చేయించుకోవాలని వ్యవసాయశాఖ అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు. దీంతోపాటు ఆర్బీకేల్లో ఈకేవైసీ వివరాలు కూడా రిజిస్టర్ చేయించుకోవాలని సూచిస్తున్నారు. ఇప్పటికే కొనుగోలుకు సంబంధించి ఏర్పాట్లను చేస్తున్నామని, మండలాల వారీగా పంట నూర్పిళ్లను బట్టి ఎప్పటి నుంచి వాటిని తెరవాలన్నది నిర్ణయిస్తామని పౌరసరఫరాలశాఖ అధికారులు చెబుతున్నారు.