1, 2 వార్డుల్లో పోలింగ్ కేంద్రాల ఏర్పాట్లు పూర్తి
ABN , First Publish Date - 2021-03-01T06:26:24+05:30 IST
భీమిలి జోన్ పరిధిలోని ఒకటి రెండు వార్డులలో ఈనెల పదిన జరగనున్న జీవీఎంసీ ఎన్నికలకు సంబంధించి పోలింగ్ కేంద్రాల ఏర్పాట్లను అధికారులు పూర్తి చేశారు.
తగరపువలస, ఫిబ్రవరి 28: భీమిలి జోన్ పరిధిలోని ఒకటి రెండు వార్డులలో ఈనెల పదిన జరగనున్న జీవీఎంసీ ఎన్నికలకు సంబంధించి పోలింగ్ కేంద్రాల ఏర్పాట్లను అధికారులు పూర్తి చేశారు. ఈ రెండు వార్డులలో మొత్తం 24 కేంద్రాలను ఏర్పాటు చేశారు. తగరపువలస, చిట్టివలస, కొండపేట, సంతపేట, కొత్తపేట, సంగివలస, వలందపేట, నమ్మివానిపేట, బ్యాంకుకాలనీ, తదితర ప్రాంతాలలో వీటిని ఏర్పాటు చేశారు. ఒకటో వార్డులో ఒకటి నుంచి 13 బూత్లను, రెండో వార్డులో 13 నుంచి 24వ నంబర్ వరకు బూత్లను ఏర్పాటు చేశారు. ఈ కేంద్రాలను పర్యవేక్షించడానికి ఇద్దరు జోనల్ అధికారులను కూడా నియమించారు. ఈ కేంద్రాల కోసం పాఠశాలలు, కల్యాణ మండపాలు, సామాజిక భవనాలను ఎంపిక చేశారు. ప్రతి కేంద్రంలో ప్రిసైడింగ్ అధికారి, సహాయ ప్రిసైడింగ్ అధికారులతో పాటు ఇద్దరు అదర్ పోలింగ్ పర్సన్ (ఓపీవో)లను నియమిస్తున్నారు. వీరు మార్చి తొమ్మిదో తేదీ నాడు ఉదయాన్నే పోలింగ్ మెటీరియల్తో ఆయా కేంద్రాలకు చేరుకోవాలని అధికారులు ఆదేశించారు. ఆ రోజు ఆయా కేంద్రాలలో, పదిన పోలింగ్కు సంబంధించిన అన్ని ఏర్పాట్లు చేసుకోవాలని కోరారు. పోలింగ్ పూర్తయ్యాక ఆ మెటీరియల్ను కౌంటింగ్ కేంద్రంలో అప్పగించేంత వరకు బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు. ఈ కేంద్రాలకు వచ్చిన వారికి ప్రభుత్వపరంగా అల్పాహారం, భోజన సదుపాయాలను జీవీఎంసీ అధికారులు చేపడుతున్నారు.