AAP మంత్రులు, ఎమ్మెల్యేలందరినీ జైల్లో వేయండి: BJPకి కేజ్రీ సవాల్

ABN , First Publish Date - 2022-06-02T17:29:11+05:30 IST

ఆమ్ ఆద్మీ పార్టీకి ఇలాంటి విచారణలు కొత్తేం కాదన్న కేజ్రీవాల్.. ఐదేళ్ల క్రితం ఆప్ నేతలపై ఇలాంటి తప్పుడు కేసులే పెట్టారని, కానీ ఏమీ రాబట్టలేకపోయారని గుర్తు చేశారు. ఆప్ కీలక నేత, డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా(Manish Sisodia)పై కూడా..

AAP మంత్రులు, ఎమ్మెల్యేలందరినీ జైల్లో వేయండి: BJPకి కేజ్రీ సవాల్

న్యూఢిల్లీ: ఢిల్లీ హోంమంత్రి సత్యేంద్ర జైన్‌(Satyendar jain)ను ఈడీ అధికారులు అరెస్ట్ చేసి విచారిస్తుండడంపై ముఖ్యమంత్రి కేజ్రీవాల్(Arvind kejriwal) తీవ్ర స్థాయిలో స్పందించారు. ఇలా ఒక్కరొక్కర్ని అరెస్ట్ చేయడం కాకుండా ఆమ్ ఆద్మీ పార్టీ(Aam Aadmi Party)కి చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలందరినీ ఒకేసారి అరెస్ట్ చేసి జైల్లో వేయమండంటూ భారతీయ జనతా పార్టీ(Bharatiya Janata Party)కి ఆయన సవాల్ విసిరారు. నిజానికి విజ్ఞప్తి పూర్వకంగానే అడుగుతున్నట్లు కేజ్రీ చెప్పినప్పటికీ ‘‘ఏం కేసులు పెట్టుకుంటారో పెట్టుకోండి. విచారణ చేసుకోండి’’ అంటూ గట్టిగానే చెప్పారు. ఒక్కొక్కరిని అరెస్ట్ చేస్తూ విచారణ పేరు మీద సమయం వృధా అవుతోందని, ప్రజా సమస్యల పరిష్కారానికి ఇది ఆటంకంగా మారుతోందని, అందుకే ఒకేసారి అందరినీ అరెస్ట్ చేసి విచారిస్తే.. ఆ తర్వాత తాము తమ పని నిర్వర్తించుకుంటామని కేజ్రీ వివరణ ఇచ్చారు.


గురువారం ఢిల్లీలో కేజ్రీవాల్ మాట్లాడుతూ ‘‘ప్రధానమంత్రి నరేంద్రమోదీకి నాదొక విజ్ఞప్తి. ఒక్కొక్కరిని ఎందుకు జైలుకు పంపిస్తున్నారు? ఇలా చేయడం వల్ల ప్రజా సమస్యల పరిష్కారంలో ప్రభుత్వానికి ఇబ్బందిగా మారుతోంది. ఆప్ మంత్రులు, ఎమ్మెల్యేలు అందరినీ ఒకేసారి అరెస్ట్ చేసి జైల్లో వేయండి. ఏమేం కేసులు పెట్టాలని అనుకుంటున్నారో అన్ని కేసులు ఒకేసారి పెట్టేయండి. అలాగే ఇప్పుడు ఉన్న కేంద్ర ఏజెన్సీలన్నింటినీ పిలిచి విచారణ చేపట్టండి. ఆ తర్వాతే మేం మా పని చేసుకుంటాం’’ అని అన్నారు.


ఆమ్ ఆద్మీ పార్టీకి ఇలాంటి విచారణలు కొత్తేం కాదన్న కేజ్రీవాల్.. ఐదేళ్ల క్రితం ఆప్ నేతలపై ఇలాంటి తప్పుడు కేసులే పెట్టారని, కానీ ఏమీ రాబట్టలేకపోయారని గుర్తు చేశారు. ఆప్ కీలక నేత, డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా(Manish Sisodia)పై కూడా తప్పుడు కేసులు పెట్టే కుట్ర జరుగుతోందని కేజ్రీవాల్ ఆరోపించారు. ఢిల్లీలో విద్య, వైద్యం అత్యుత్తమంగా తీర్చిదిద్దామని వాటిని ఆపేందుకే బీజేపీ ఇలాంటి చర్యలకు పాల్పడుతోందని విమర్శలు గుప్పించారు. విద్య విషయంలో మనీశ్ సిసోడియా అద్భుతంగా పని చేశారని, వైద్యం విషయంలో సత్యేంద్ర జైన్ ఉత్తమ ఫలితాలు రాబట్టరాని అందుకే వారిపై తప్పుడు కేసులు పెట్టైనా ఢిల్లీ అభివృద్ధిని ఆపాలని చూస్తోందని కేజ్రీవాల్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.

Updated Date - 2022-06-02T17:29:11+05:30 IST