ఈనెలలోనూ ఉచిత రేషన్ లేనట్లే!
ABN , First Publish Date - 2022-06-16T07:24:55+05:30 IST
కరోనా విపత్కర పరిస్థితుల్లో కేంద్రప్రభుత్వం ఉచితంగా తెల్ల రేషన్ కార్డుదారులకు ఇచ్చే బియ్యం జూన్లోనూ లేనట్లుగా కనిపిస్తోంది.
కేంద్రం కోటాగా ఇచ్చే బియ్యంపై సందిగ్ధం
మూడు నెలల నుంచి ఇదే పరిస్థితి
ఒంగోలు (కలెక్టరేట్), జూన్ 15: కరోనా విపత్కర పరిస్థితుల్లో కేంద్రప్రభుత్వం ఉచితంగా తెల్ల రేషన్ కార్డుదారులకు ఇచ్చే బియ్యం జూన్లోనూ లేనట్లుగా కనిపిస్తోంది. గత మూడు నెలల నుంచి కేంద్రం ఉచిత బియ్యం కేటాయింపులు చేయకపోవడంతో సందిగ్ధం నెలకొంది. 2020 మార్చిలో కరోనా విపత్కర పరిస్థితులు నెలకొనడంతో దేశంలో అర్హులైన కార్డుదారులకు ఉచితంగా బియ్యం పంపిణీ చేయాలని కేంద్ర కేబినెట్లో తీర్మానించి ఆ విధంగానే పంపిణీ చేస్తూ వచ్చింది. ఈ ఏడాది మార్చిలో ఆ ప్రక్రియ ముగియడంతో ఏప్రిల్ నుంచి మరో ఆరునెలల పాటు పొడిగించింది. అయితే వివిధ కారణాలతో ఏప్రిల్లో ఇవ్వని కేంద్రం మేలో ఏప్రిల్, మే నెలవి కలిపి ఒకేసారి ఇస్తామని ప్రకటించింది. అయినా ఇంతవరకు ఆ బియ్యం పంపిణీపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. అయితే రేషన్షాపుల ద్వారా ఈనెల 18వతేదీ నుంచి తెల్లరేషన్ కార్డుదారులకు ఉచితబియ్యం పంపిణీ చేయాల్సి ఉండగా ఇంతవరకు పౌరసరఫరాల శాఖ అధికారులకు ప్రభుత్వం నుంచి స్పష్టత రాలేదు.
జిల్లాలో 6.55లక్షల మంది తెల్లకార్డుదారులు
జిల్లాల విభజన అనంతరం జిల్లాలో 6,55,470 తెల్లరేషన్ కార్డులు ఉన్నాయి. ఒక్కొక్కరికి ఐదు కిలోల చొప్పున కార్డుదారులకు ఉచితంగా బియ్యం పంపిణీ చేయాల్సి ఉంది. అయితే గత మూడు నెలల నుంచి ఉచిత బియ్యం పంపిణీ చేయకపోవడంతో కార్డుదారులు రేషన్షాపుల చుట్టూ తిరుగుతున్నారు. ఈనెలలో పంపిణీ ఉందా లేదా అనేది ఇంతవరకు డీలర్లకు కూడా ఉన్నతాధికారుల నుంచి స్పష్టత లేకపోవడంతో ఏమీ చెప్పలేని పరిస్థితి ఏర్పడింది.
బీజేపీ నేతల ఫిర్యాదులతోనే కేంద్రం నిలుపుదల చేసిందా...
రాష్ట్రంతోపాటు జిల్లాలో కేంద్రం ఉచితంగా ఇస్తున్న రేషన్బియ్యాన్ని అధికారపార్టీ నాయకులు అక్రమంగా ఇతర దేశాలకు ఎగుమతులు చేస్తున్నారని బీజేపీ నాయకులు ఆందోళనలు నిర్వహించారు. మార్కాపురం ప్రాంతంలో అక్రమంగా తరలిస్తున్న రేషన్ వాహనాన్ని పట్టుకొని పోలీసులకు అప్పగించారు. ఆ సమయంలో బీజేపీ నేతలపై కూడా కేసులు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని పలు జిల్లాలకు చెందిన బీజేపీ నాయకులు ఉచిత బియ్యం అక్రమ వ్యాపారాలపై కేంద్ర ప్రభుత్వానికి పెద్దఎత్తున ఫిర్యాదులు చేసినట్లు తెలిసింది. దీని కారణంగా కేంద్రం ఉచిత బియ్యాన్ని రాష్ట్రంలో నిలుపుదల చేసి విచారణకు ఆదేశించిందనే వాదనలు బలంగా వినిపిస్తున్నాయి.