కోవిడ్ చికిత్స కోసం బెయిలు కోరిన ఆశారాం
ABN , First Publish Date - 2021-05-11T19:52:11+05:30 IST
పదహారేళ్ల బాలికపై అత్యాచారం కేసుకు సంబంధించి యావజ్జీర కారాగార శిక్ష పడిన..
జోథ్పూర్: పదహారేళ్ల బాలికపై అత్యాచారం కేసుకు సంబంధించి యావజ్జీర కారాగార శిక్ష పడిన వివాదాస్పద ఆధ్యాత్మిక గురువు ఆశారాం బాపూజీ రాజ్స్థాన్ హైకోర్టులో బెయిలు కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఉత్తరాఖండ్లోని హరిద్వార్లో చికిత్స చేయించుకునేందుకు తనకు బెయిలు ఇవ్వాలని ఆయన విజ్ఞప్తి చేశారు. కోవిడ్ పాజిటివ్ బారిన పడిన ఆశారాం జోథ్పూర్లోని ఎయిమ్స్లో ప్రస్తుతం చికిత్సపొందుతున్నారు. తనకు కోవిడ్ పాజిటివ్ వచ్చినందున ఆయుర్వేద చికిత్స తీసుకోవాలని అనుకుంటున్నట్టు ఆయన తన బెయిలు దరఖాస్తులో తెలిపారు. గత బుధవారంనాడు శ్వాస సంబంధిత సమస్యను ఎదుర్కోవడంతో తొలుత మధుర దాస్ మథుర్ ఆసుపత్రిలో ఆయనను చేర్చి, శుక్రవారంనాడు ఎయిమ్స్కు తరలించారు. జోథ్పూర్ జైలులో ఆశారాం సహా 12 మందికి కోవిడ్ పాజిటివ్ వచ్చింది. కాగా, ఈనెల 13న ఆశారాం బెయిలు అభ్యర్థనపై విచారణ జరగనుంది.