Ashok Gehlot In Trouble? ఢిల్లీలో గెహ్లాట్ పడిగాపులు.. ఇంకా దొరకని సోనియా అపాయింట్మెంట్.. రేపు దిగ్విజయ్ నామినేషన్
ABN , First Publish Date - 2022-09-29T18:31:15+05:30 IST
న్యూఢిల్లీ: కాంగ్రెస్ అధ్యక్ష పదవికి నామినేషన్లు దాఖలు చేసేందుకు రేపే (సెప్టెంబర్ 30) ఆఖరు.
న్యూఢిల్లీ: కాంగ్రెస్ అధ్యక్ష పదవికి నామినేషన్లు దాఖలు చేసేందుకు రేపే (సెప్టెంబర్ 30) ఆఖరు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ అధ్యక్ష పదవి కోసం నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఇప్పటికే ఆయన కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నుంచి నామినేషన్ పత్రాలను స్వీకరించారు. రేపు (సెప్టెంబర్ 30) నామినేషన్ వేస్తానని ప్రకటించారు. కాంగ్రెస్ అధ్యక్ష పదవికి ఇద్దరు పోటీపడతారా లేక ముగ్గురా అని అడిగిన ప్రశ్నకు అక్టోబర్ నాలుగున నామినేషన్ల ఉపసంహరణ వరకూ వేచి ఉండాలని దిగ్విజయ్ విలేకరులకు చెప్పారు.
మరోవైపు శశిథరూర్ కూడా రేపు నామినేషన్ వేస్తారని కాంగ్రెస్ పార్టీ వర్గాలు తెలిపాయి.
ఇలా ఉంటే నిన్న రాత్రి నుంచి ఢిల్లీలో పడిగాపులు కాస్తున్న రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్కు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుు సోనియా గాంధీ అపాయింట్మెంట్ ఇంకా దొరకలేదు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవికి గెహ్లాట్ నామినేషన్ దాఖలు చేస్తారా లేదా అనేది ఇంకా తెలియరాలేదు.
రాజస్థాన్లో తాము సూచించే వ్యక్తినే సీఎం చేయాలని అశోక్ గెహ్లాట్తో పాటు ఆయన వర్గీయులు చేసిన ఓవరయాక్షన్పై సోనియా గుర్రుగా ఉన్నారు. తాను కాంగ్రెస్ అధ్యక్షుడిగా వెళ్తే తన ప్రత్యర్థి సచిన్ పైలట్ను మాత్రం సీఎంను చేయవద్దని గెహ్లాట్ కోరుతున్నారు. అంతేకాదు కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడెవరో తేలేదాకా అంటే అక్టోబర్ 19 వరకూ రాజస్థాన్ సీఎం ఎవరనేది తేల్చవద్దని కూడా గెహ్లాట్ కోరుతున్నారు.
కాంగ్రెస్ అధ్యక్ష పదవికి అక్టోబర్ 17న ఎన్నికలు జరగనున్నాయి. సోనియా కుటుంబ సభ్యులు కాకుండా బయటివారే కాంగ్రెస్ అధ్యక్షుడు కావాలని రాహుల్ గాంధీ కోరుతున్నారు. అందుకే ఆయన నామినేషన్ వేయడం లేదు.