వీరజవాన్ కుటుంబానికి అశోక్ పరామర్శ
ABN , First Publish Date - 2021-04-15T05:29:21+05:30 IST
వీరజవాన్ రౌతు జగదీష్ కుటుంబ సభ్యులను టీడీపీ పొలిట్బ్యూరో సభ్యుడు, కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజు పరామర్శించారు.
విజయనగరం (ఆంధ్రజ్యోతి) ఏప్రిల్ 14 : వీరజవాన్ రౌతు జగదీష్ కుటుంబ సభ్యులను టీడీపీ పొలిట్బ్యూరో సభ్యుడు, కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజు పరామర్శించారు. ఈ మేరకు బుధవారం గాజులరేగ చేరుకుని జగదీష్ తల్లిదండ్రులు, సోదరిని ఓదార్చారు. వీరజవాన్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. ఛత్తీస్గఢ్ కాల్పుల్లో వీరమరణం పొందిన జగదీష్ భారతీయుల గుండెల్లో చిరంజీవిగా జీవించి ఉంటారని తెలిపారు. జగదీష్ కుటుంబ సభ్యులకు పార్టీ, ప్రజలు అండగా ఉంటారని, అధైర్యపడొద్దని చెప్పారు. టీడీపీ నాయకులు అదితి గజపతిరాజు, ఐవీపీ రాజు, కందిమురళీనాయుడు, రొంగళి రామారావు, బేగం, సూర్యకుమారి తదితరులు పాల్గొన్నారు.
‘రాళ్లదాడిపై దర్యాప్తు జరపండి’
విజయనగరం రూరల్: తిరుపతి ఉప ఎన్నికల ప్రచారంలో టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబుపై జరిగిన రాళ్లదాడిపై దర్యాప్తు జరిపించాలని టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జి అదితి గజపతిరాజు డిమాండ్ చేశారు. బుధవారం పార్టీ కార్యాలయంలో మాట్లాడుతూ.. ప్రతిపక్షనేతగా జడ్ప్లస్ కేటగిరీలో ఉన్న చంద్రబాబుపై రాళ్ల దాడి చేయడం అన్యాయమని, ప్రజాస్వామ్యవాదు లంతా ఖండించాలని కోరారు. దీనిపై ప్రభుత్వం పట్టించు కోకపోవడం దారుణమన్నారు. చంద్రబాబు ముఖ్య మంత్రిగా ఉన్న సమయంలో అప్పటి ప్రభుత్వం సహక రించకపోతే, జగన్రెడ్డి పాదయాత్ర చేసేవారా? అని ప్రశ్నించారు. టీడీపీ నేతలు ఐవీపీ రాజు, అనురాధ బేగం, మురళీ నాయుడు తదితరులు పాల్గొన్నారు.