Archaeological Survey : పాట్నాలో 2,000 ఏళ్ళనాటి గోడలు

ABN , First Publish Date - 2022-06-04T23:36:57+05:30 IST

బిహార్‌లోని కుమ్రహార్ ప్రాంతంలో ఓ చెరువు పునరుద్ధరణ పనులు

Archaeological Survey : పాట్నాలో 2,000 ఏళ్ళనాటి గోడలు

పాట్నా : బిహార్‌లోని కుమ్రహార్ ప్రాంతంలో ఓ చెరువు పునరుద్ధరణ పనులు జరుగుతుండగా దాదాపు 2,000 ఏళ్ళనాటి ఇటుక గోడల అవశేషాలు బయటపడ్డాయి. భారత పురాతత్వ అధ్యయనాల సంస్థ (Archaeological Survey of India) పాట్నా సర్కిల్ వీటిని గుర్తించింది. గతంలో ఈ ప్రాంతంలో మౌర్య సామ్రాజ్య కాలంనాటి అవశేషాలు కనిపించాయి. 


ఏఎస్ఐ పాట్నా సర్కిల్ పర్యవేక్షక ఆర్కియాలజిస్ట్ గౌతమి భట్టాచార్య మీడియాతో మాట్లాడుతూ, పాట్నా రైల్వే స్టేషన్‌కు ఆరు కిలోమీటర్ల దూరంలో కుమ్రహార్ వద్ద ఓ చెరువు పునరుద్ధరణ పనులు జరుగుతున్నాయని చెప్పారు. దీనికి సంబంధించిన తవ్వకాల్లో ఇటుక గోడల అవశేషాలు గురువారం కనిపించాయన్నారు. ఈ గోడ దాదాపు 2,000 సంవత్సరాల క్రితంనాటిదని అంచనా వేస్తున్నట్లు తెలిపారు. 


కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ‘అమృత్ సరోవర్’ పథకంలో భాగంగా ఈ చెరువు పునరుద్ధరణ పనులు జరుగుతున్నాయన్నారు. ఇక్కడ కనిపించిన ఇటుక గోడలకు చాలా ప్రాధాన్యం ఉందన్నారు. ఏఎస్ఐ నిపుణుల బృందం ఈ గోడలకుగల పురాతత్వ ప్రాధాన్యాన్ని విశ్లేషిస్తున్నట్లు తెలిపారు. ఈ ఇటుకలు కుషాణుల కాలంనాటివని భావిస్తున్నామన్నారు. కుషాణుల పరిపాలనలో ఉత్తర భారత దేశం, ప్రస్తుత ఆఫ్ఘనిస్థాన్, మధ్య ఆసియాలో కొంత భాగం ఉండేవని చెప్పారు. ఈ ఇటుకలు సామాన్య శకం 30 నుంచి సామాన్య శకం 375 మధ్య కాలానికి చెందినవని అంచనా వేస్తున్నట్లు తెలిపారు. ఈ ఇటుక గోడల గురించి న్యూఢిల్లీలోని ఏఎస్ఐ ప్రధాన కార్యాలయానికి సమాచారం ఇచ్చామని చెప్పారు. 


కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న మిషన్ అమృత్ సరోవర్‌లో భాగంగా బిహార్‌లోని అన్ని (11) రక్షిత జలాశయాలను ఏఎస్ఐ-పాట్నా పునరుద్ధరిస్తోంది. 


Updated Date - 2022-06-04T23:36:57+05:30 IST