పాతకక్షలతో స్నేహితుడిపై కత్తితో దాడి

ABN , First Publish Date - 2021-03-03T05:21:39+05:30 IST

పాత కక్షలను మనసులో పెట్టుకుని స్నేహితుడి పైనే హత్యాయత్నం చేసిన ఘటన మంగళవారం నగరంలో చోటుచేసుకుంది.

పాతకక్షలతో స్నేహితుడిపై కత్తితో దాడి
చికిత్స పొందుతున్న సురేష్‌ నుంచి వివరాలు తెలుసుకుంటున్న పోలీసులు

  చిత్తూరు, మార్చి 2: పాత కక్షలను మనసులో పెట్టుకుని స్నేహితుడి పైనే హత్యాయత్నం చేసిన ఘటన మంగళవారం నగరంలో చోటుచేసుకుంది. తాగిన మత్తులో సంగటి కోసం తిట్టుకుని కత్తితో పొడిచి పారిపోయాడు. పోలీసులు సకాలంలో ఆస్పత్రికి తీసుకెళ్లడంతో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నాడు. దీనికి  సంబంధిం చి ఎస్‌ఐ మోహన్‌ కుమార్‌ అందించిన వివరాలిలా.. సురేష్‌కుమార్‌(34) అనే ఆటో డ్రైవర్‌ చౌడేశ్వరమ్మ గుడి వీధిలో తన అక్క ఇంట్లో ఉంటున్నాడు. ఇతనికి కొండమిట్టకు చెందిన దయాళన్‌(38) అనే స్నేహితుడున్నాడు. వీరిద్దరూ ఆరు నెలల క్రితం మద్యం మత్తు లో  ఘర్షణపడడంతో సురేష్‌ స్నేహితుడైన దయాళన్‌ను కొట్టి గాయపరిచాడు. దీనిపై దయాళన్‌ మనసులో పగపెంచుకున్నాడు. ఈ క్రమంలో మంగళవారం ఇద్దరు కలిసి కలెక్టర్‌ బంగ్లా ఎదురుగా ఉన్న హోటల్‌కు వెళ్లి సంగటి  కావాలని చెప్పారు. తనకు సంగటి వద్దని, డబ్బులివ్వాలని దయాళన్‌ అడిగాడు. డబ్బులు లేదని.. సంగటి కావాలంటే తీసుకో అని సురేష్‌ చెప్పాడు. అప్పటికే ఇద్దరు మద్యం సేవించి ఉండటంతో ఒకరికొకరు తోసుకున్నారు. దీంతో బయటికి వెళ్లాలని హోటల్‌ యజమాని చెప్పటంతో  బయటకు వచ్చిన సురేష్‌ ఆటోలో కూర్చున్నాడు. హఠాత్తుగా దయాళన్‌ కత్తితో సురేష్‌  మెడపై పొడిచి పారిపోయాడు. స్తానికులు పోలీసులకు సమాచార మివ్వడంతో ఒకటో పట్టణ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సురేష్‌ను చిత్తూరు ప్రభుత్వాస్పత్రికి తరలించగా వైద్యుల సూచన మేరకు తిరుపతి రుయాస్పత్రికి తరలిచి వైద్యం అందిస్తున్నారు. ప్రస్తుతం అతని ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని, దయాళన్‌ను అదుపులోకి తీసుకున్నామని ఎస్‌ఐ మోహన్‌ కుమార్‌ తెలిపారు. 

Updated Date - 2021-03-03T05:21:39+05:30 IST