Ops తొలగింపుపై లేఖ అందలేదు.. వస్తే పరిశీలిస్తా: స్పీకర్‌

ABN , First Publish Date - 2022-07-15T14:17:31+05:30 IST

అన్నాడీఎంకే సభాపక్ష ఉపనాయకుడి పదవి నుంచి మాజీ ముఖ్యమంత్రి ఒ.పన్నీర్‌సెల్వంను తొలగించే విషయమై ఆ పార్టీ సభాపక్ష నేత ఎడప్పాడి

Ops తొలగింపుపై లేఖ అందలేదు.. వస్తే పరిశీలిస్తా: స్పీకర్‌

చెన్నై, జూలై 14 (ఆంధ్రజ్యోతి): అన్నాడీఎంకే సభాపక్ష ఉపనాయకుడి పదవి నుంచి మాజీ ముఖ్యమంత్రి ఒ.పన్నీర్‌సెల్వంను తొలగించే విషయమై ఆ పార్టీ సభాపక్ష నేత ఎడప్పాడి పళనిస్వామి నుండి తనకు ఎలాంటి లేఖ అందలేదని స్పీకర్‌ అప్పావు పేర్కొన్నారు. సచివాలయం వద్ద గురువారం ఉదయం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ... అన్నాడీఎంకే సభాపక్ష ఉప నాయకుడి పదవి నుంచి తనను తొలగించరాదని కోరుతూ పన్నీర్‌సెల్వం తన సహాయకుడి ద్వారా లేఖ పంపారని, తనకు బదులుగా అన్నాడీఎంకే సభాపక్ష ఉపనాయకుడిగా ఎవరినీ నియమించకుండా అడ్డుకోవాలంటూ ఓపీఎస్‌ ఆ లేఖలో కోరినట్టు తెలిపారు. ఎడప్పాడి నుంచి దానిపైౖ లేఖ వస్తే పరిశీలిస్తానని తెలిపారు. వారిద్దరి విజ్ఞప్తులను పరిశీలించి నిష్పక్షపాతంగా స్పీకర్‌గా తనకున్న అధికారాన్ని బట్టి చర్యలు తీసుకుంటానన్నారు. ప్రధాన ప్రతిపక్షమైన అన్నాడీఎంకేలో ఇటీవల చోటుచేసుకున్న మార్పుల గురించి తాను మీడియా ద్వారా తెలుసుకున్నానని, అదంతా ఆ పార్టీ అంతర్గత వ్యవహారం కనుక ఆ విషయమై తాను ఎలాంటి వ్యాఖ్యలు చేయకూడదన్నారు. ఇద్దరూ కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయడంతో అక్కడే పరిష్కారం లభిస్తుందని వివరించారు. 

Updated Date - 2022-07-15T14:17:31+05:30 IST