Russia: స్కూల్లో కాల్పులు.. 11 మంది విద్యార్థుల మృతి
ABN , First Publish Date - 2021-05-11T20:49:38+05:30 IST
రష్యాలోని ఓ స్కూల్లో దుండగుడు జరిపిన కాల్పుల్లో 11 మంది విద్యార్థులు మృతి చందారు. మరికొందరు తీవ్రంగా
మాస్కో: రష్యాలోని ఓ స్కూల్లో దుండగుడు జరిపిన కాల్పుల్లో 11 మంది విద్యార్థులు మృతి చెందారు. మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. కజన్ నగరంలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తుపాకుల శబ్దం వినిపిస్తున్న సమయంలో ఇద్దరు విద్యార్థులు మూడో అంతస్తు నుంచి దూకడం వీడియోలో కనిపించింది. ఇద్దరు టీనేజ్ కుర్రాళ్లు కాల్పులకు పాల్పడినట్టు చెబుతుండగా, కొందరు మాత్రం నిందితుడు ఒకడేనని చెబుతున్నారు. స్కూల్లో పేలుడు కూడా సంభవించినట్టు తెలుస్తోంది. 19 ఏళ్ల దుండగుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఈ ఘటన వెనక ఉన్న అసలు కారణం తెలియరాలేదు. కాగా, మరో దుండగుడు పారిపోయి ఉండొచ్చన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. నిజానికి స్కూల్లో కాల్పుల ఘటనలు రష్యాలో చాలా అరుదు. 2018లో చివరిసారి క్రిమియాలో ఇలాంటి ఘటన ఒకటి జరిగింది. ఓ కాలేజీ విద్యార్థి జరిపిన కాల్పుల్లో అప్పట్లో 19 మంది మృత్యువాత పడ్డారు. ఆ తర్వాత దుండగుడు తనను తాను కాల్చుకున్నాడు. ముస్లిం ప్రాబల్యం కలిగిన టటర్స్థాన్ రాజధాని కజన్. ఇది రాజధాని మాస్కోకు 725 కిలోమీటర్ల దూరంలో ఉంది.