నేపాల్‌లో బీభత్సం సృష్టిస్తున్న వరదలు.. 16 మంది మృతి

ABN , First Publish Date - 2021-06-20T00:39:06+05:30 IST

ఆదివారం నుంచి ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షాలు నేపాల్‌ను అతలాకుతలం చేస్తున్నాయి. వరదలు, కొండచరియలు

నేపాల్‌లో బీభత్సం సృష్టిస్తున్న వరదలు.. 16 మంది మృతి

కాఠ్మాండూ: ఆదివారం నుంచి ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షాలు నేపాల్‌ను అతలాకుతలం చేస్తున్నాయి. వరదలు, కొండచరియలు విరిగిపడడం కారణంగా ఇప్పటి వరకు 16 మంది ప్రాణాలు కోల్పోగా, 22 మంది అదృశ్యమయ్యారు. కొండచరియలు విరిగిపడడం కారణంగా 11 మంది తీవ్రంగా గాయపడ్డారు. మొత్తం ఆరు జిల్లాలు వర్షాల కారణంగా అతలాకుతలమయ్యాయని నేపాల్ హోంమంత్రిత్వ శాఖ పేర్కొంది. మరణించిన వారిలో ముగ్గురు విదేశీయులు కూడా ఉన్నారని తెలిపింది. వర్షానికి తోడు కొండచరియలు విరిగిపడుతుండడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. 


ఆస్తి, ప్రాణా నష్టానికి సంబంధించిన నివేదిక అందాల్సి ఉందని ప్రభుత్వం పేర్కొంది. ఇక, వరదల్లో చిక్కుకుని వారి కోసం సహాయక బృందాలు గాలిస్తున్నాయి. వర్షాల కారణంగా సింధుపాల్‌చోక్, మనంగ్ జిల్లాల్లో భారీ నష్టం వాటిల్లింది. రంగంలోకి దిగిన ఆర్మీ వరద ప్రభావిత ప్రాంతాల్లోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తోంది. కాగా, పర్వతాలపై మంచు కరగడంతో సింధుపాల్ చౌక్ జిల్లాలో వరద పోటెత్తిందని అధికారులు తెలిపారు. ఇంద్రావతి, మేలమ్చి నదుల్లో నీటి మట్టం ప్రమాదకరస్థాయికి చేరుకుంది. వర్షాకాలంలో ప్రతి ఏడాది నేపాల్‌లో వరదలు, కొండచరియలు విరిగిపోవడం కారణంగా వందలాదిమంది ప్రాణాలు కోల్పోతున్నారు. దేశవ్యాప్తంగా వర్షాలు భారీగా కురుస్తుండడంతో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది.

Updated Date - 2021-06-20T00:39:06+05:30 IST