జనాదరణలో అట్టడుగున!
ABN , First Publish Date - 2022-07-13T07:58:34+05:30 IST
జనాదరణలో అట్టడుగున!
దిగువ నుంచి ఆరో స్థానంలో జగన్.. మొత్తంగా 20వ స్థానం
11వ ర్యాంకులో కేసీఆర్.. నవీన్ పట్నాయక్ నంబర్ వన్
మొదటి 5 స్థానాల్లో ఒడిసా, యూపీ, మహారాష్ట్ర, అసోం, పంజాబ్ సీఎంలు
సర్వే ఫలితాలు వెల్లడించిన సీఎన్వోఎస్
స్వల్పంగా మెరుగుపడిన మోదీ రేటింగ్
అమరావతి, జూలై 12(ఆంధ్రజ్యోతి): తమ అధినేత జగన్మోహన్రెడ్డి మాట తప్పని, మడమ తిప్పని గొప్ప నాయకుడని.. అత్యంత జనాదరణ ఉన్న సీఎం అంటూ వైసీపీ వర్గా లు సోషల్ మీడియాలో ఊదరగొడుతుంటాయి. కానీ ప్రా మాణిక సర్వేల్లో ఆయన చివరి వరుసలో నిలుస్తున్నారు. సెంటర్ ఫర్ నేషనల్ ఒపీనియన్ సర్వే(సీఎన్వోఎస్) తా జాగా విడుదల చేసిన సర్వే ఫలితాలు ఇదే విషయం వెల్లడించాయి. ప్రధాని మోదీతోపాటు దేశంలోని 25 రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ప్రజాదరణ ఏ మేరకు ఉందనే అంశంపై ఇటీవల సీఎన్వోఎస్ బృందాలు ఆయా రాష్ట్రాల్లో సర్వే నిర్వహించగా.. జగన్ 20వ స్థానంలో నిలిచారు. మొత్తం 25 మంది సీఎంలలో ఆయన అడుగు నుంచి ఆరో స్థానంలో ఉన్నారు. రాష్ట్రంలో 39 శాతం మంది ఆయన నాయకత్వంపై సంతృప్తి వ్యక్తం చేశారు. 29 శాతం మంది అసంతృప్తితో ఉన్నారు. మిగిలిన 32 శాతం మంది తమ అభిప్రాయం వెల్లడించకుండా తటస్థంగా ఉండిపోయారు. తెలంగాణ సీఎం కేసీఆర్ 11వ స్థానంలో నిలిచారు. ఆయన నాయకత్వంపై 49 శాతం మంది ప్రజలు సంతృప్తితో ఉండగా.. 19 శాతం మం ది అసంతృప్తితో ఉన్నారు. 24ు మంది తటస్థంగా ఉన్నారు. దేశంలో ప్రస్తుతం అత్యంత ప్రజాదరణ పొందిన సీఎంగా ఒడిసా సీఎం నవీన్ పట్నాయక్ నిలిచారు. ఆ రాష్ట్రంలో 70 శాతం ప్రజలు ఆయన నాయకత్వంపై పూర్తి సంతృప్తితో ఉండగా.. 19 శాతం మందే అసంతృప్తి వ్యక్తం చేశారు. దేశంలో జనాదరణ పొందిన మొదటి ఐదుగురు ముఖ్యమంత్రుల్లో నవీన్ 51 పాయింట్ల నికర ఆమోదంతో ప్రథమ స్థానంలో నిలవగా.. తర్వాతి స్థానాల్లో వరుసగా యోగి ఆదిత్యనాథ్(ఉత్తరప్రదేశ్), ఉద్ధవ్ ఠాక్రే(మహారాష్ట్ర-ఇటీవలే రాజీనామా చేశారు), హిమంత బిశ్వ శర్మ(అసోం), భగవంత్సింగ్ మాన్(పంజాబ్) నిలిచారు. జగన్ తర్వాత అట్టడుగున నిలిచిన సీఎంలలో మనోహర్లాల్ ఖట్టర్(హరియాణా), బసవరాజ్ బొమ్మయ్(కర్ణాటక), నీఫూ రియో(నాగాలాండ్), ప్రమాద్ సావంత్ (గోవా), మాణిక్ సాహా(త్రిపుర) ఉన్నారు. సీఎన్వోఎస్ తాజా సర్వే ప్రకారం ప్రధాని మోదీకి ప్రజాదరణ స్వల్పంగా పెరిగింది. గతంతో పోలిస్తే నికర ఆమోదం రేటింగ్ 36 పాయింట్లకు చేరుకుంది. దేశంలో 54 శాతం మంది ఆయన నాయకత్వాన్ని ఆమోదించారు. 18 శాతం మంది అసంతృప్తితో ఉన్నారు.