ATA: అట్లాంటాలో 'ఆటా' కీలక బోర్డు సమావేశం

ABN , First Publish Date - 2022-09-28T17:53:59+05:30 IST

అమెరికాలోని అట్లాంటా నగరంలో సెప్టెంబర్ 24వ తారీఖున (శనివారం) అమెరికన్ తెలుగు అసోసియేషన్ (ATA) కార్యవర్గ సమావేశం నిర్వహించింది.

ATA: అట్లాంటాలో 'ఆటా' కీలక బోర్డు సమావేశం

అట్లాంటా: అమెరికాలోని అట్లాంటా నగరంలో సెప్టెంబర్ 24వ తారీఖున (శనివారం) అమెరికన్ తెలుగు అసోసియేషన్ (ATA) కార్యవర్గ సమావేశం నిర్వహించింది. ఈ సమావేశంలో పెద్ద ఎత్తున కార్యవర్గ సభ్యులు, స్టాండింగ్ కమిటీస్, రీజినల్ కోఆర్డినేటర్స్  పాల్గొనగా, కీలకమైన విషయాలను చర్చించారు. ఆటా కార్యవర్గ ప్రతినిధుల ఆఫీస్‌ను చికాగోలో ఏర్పాటు చేయడానికి ఆటా బోర్డు ఏకగ్రీవంగా తీర్మానం చేసింది. ఆటా ప్రెసిడెంట్ భువనేశ్ బుజాల ప్రారంభోపన్యాసం చేస్తూ తనపై కార్యవర్గం ఉంచిన ఈ గురుతర బాధ్యతకు సదా కృతఙన్యుడినని, తన ఆధ్వర్యంలో ఆటాలో ఎన్నో వినూత్నమైన కార్యక్రమాలు నిర్వహించామని వివరించారు. 


ఆటా చరిత్రలో ఎప్పుడు చూడని విధంగా 15,000 మందితో వాషింగ్టన్ డీసీలో మహా సభలు నిర్వహించటం తన అదృష్టంగా భావిస్తున్నాని తెలిపారు. దీనికి తోడ్పాటు అందిచనందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేశారు. కోశాధికారి సాయినాథ్ రెడ్డి బోయపల్లి ట్రెషూర్ర్ రిపోర్ట్ బోర్డుకి సమర్పించారు. కాన్ఫరెన్స్ సమయంలో ఎంతో సమర్ధవంతంగా కోశాధికారి బాధ్యతలు నిర్వహించినందులకు వారి సేవలను ఆటా బోర్డు కొనియాడింది. ఎన్నో కీలకమైన విషయాలు చర్చించిన ఈ సమావేశాన్ని సమర్ధవంతంగా నిర్వహించనందుకు సెక్రటరీ హరిప్రసాద్ రెడ్డి లింగాలను ఆటా కార్యవర్గం అభినందించింది. 


ప్రతి రెండు సంవత్సరాలకి ఆటా ఎంపిక చేసే నూతన కార్యవర్గ ఎంపిక కోసం నామినేషన్ కమిటీ చైర్మన్‌గా పరమేష్ భీంరెడ్డిని ఎంపిక చేశారు. ఈ సందర్భంగా పరమేష్ మాట్లాడుతూ, ఎంతో సమర్ధవంతంగా ఆటాని ముందుండి నడిపించినందుకు ఆటా ప్రెసిడెంట్ భువనేశ్‌ను అభినందించారు. మొదటి సారి వినూత్న పద్దతిలో బ్యాలెట్ ద్వారా నామినేషన్ కమిటీ సభ్యులను ఎన్నుకున్నారు. ఎలక్ట్రానిక్ ఓటింగ్ ప్రాసెస్, ఉపయోగాలను జాయింట్ సెక్రటరీ రామకృష్ణ అల్లా వివరించారు. ఆటా ఎన్నికలు ఎలక్ట్రానిక్ బ్యాలెట్ ద్వారా నిర్వహించడానికి సభ ఆమోద ముద్ర వేసింది. ఎలక్షన్ కమిటీ చైర్‌గా జాయింట్ ట్రేజరర్  విజయ్ కుందూరు వ్యవహరించనున్నారు. అలాగే ఎలక్షన్ కమిటీ సభ్యులను ప్రకటించారు.  


ఆటా 17వ కాన్ఫరెన్స్ కన్వీనర్ సుధీర్ బండారు, కో-కన్వీనర్ కిరణ్ పాశం, కోర్ కమిటీ, ఆడ్-హాక్, కాన్ఫరెన్స్ కమిటీస్ సభ్యులకు ధన్యవాదాలు తెలియజేశారు. ఆటా కాన్ఫరెన్స్ అడ్వైజరీ కమిటీ చైర్ జయ్ చల్ల ఇంత పెద్ద ఎత్తున ఆటా మహాసభలు నిర్వహించటం ద్వారా ఆటా బ్రాండ్ వాల్యూ రెట్టింపు కావడం ఆనందాయకం అని తెలిపారు. ఆటా అడ్వైజరీ కమిటీ చైర్ హనుమంత్ రెడ్డి అట్లాంటాలో సభను ఘనంగా నిర్వహించినందుకు నిర్వాహకులకు ధన్యవాదాలు తెలియజేశారు. ఆటా ఆఫీస్ చికాగోలో నెలకొల్పాలనే తన చిరకాల స్వప్నాన్ని సాకారం చేసినందుకు బోర్డు సభ్యులను అభినందించారు.   


ఇక అట్లాంటా టీం సాయంత్రం నిర్వహించిన కార్యక్రమంలో ఆటా పూర్వ ప్రెసిడెంట్ కరుణాకర్ అసిరెడ్డి, బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ అనిల్ బొదిరెడ్డి,  వేణు పీసీకే, ప్రశీల్ గూకంటి, కాన్ఫరెన్స్ కో-కోర్డినేటర్ కిరణ్ పాశం.. ఈ కార్యక్రమం స్పాన్సర్లను ఘనంగా సత్కరించారు. ఆటా ప్రెసిడెంట్ ఎలెక్ట్ మధు బొమ్మినేని మాట్లాడుతూ నామినేషన్ ప్రాసెస్, ఎలక్ట్రానిక్ ఓటింగ్ పద్దతి ద్వారా పటిష్టమైన నూతన కార్యవర్గం ఏర్పాటు అవుతుందని ఆకాంక్షించారు. మహిళలు విరివిగా సంస్థ కార్యకలాపాలలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఆటా అట్లాంటా టీం ఇంత అద్భుతంగా ఏర్పాట్లు చేయ్యడం తనకు ఎంతో ఆనందదాయకం అని కొనియాడారు. డాన్స్ ప్రోగ్రామ్స్, సింగర్స్ పాడిన పాటలు ఆహ్వానితులను అలరించాయి. 










Updated Date - 2022-09-28T17:53:59+05:30 IST