ఆ దెబ్బకు ఉన్న పరిశ్రమలు పారిపోయాయి: అచ్చెన్నాయుడు
ABN , First Publish Date - 2022-08-17T22:06:59+05:30 IST
జగన్ రెడ్డి పాలనలో పరిశ్రమలకు శ్రమలు వచ్చిపడ్డాయని టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు.
అమరావతి: జగన్ రెడ్డి పాలనలో పరిశ్రమలకు శ్రమలు వచ్చిపడ్డాయని టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రానికి కొత్త పరిశ్రమలు రాకపోగా జే ట్యాక్స్ దెబ్బకు ఉన్న పరిశ్రమలు పారిపోయాయన్నారు. ఏపీలో ఏదైనా కంపెనీ పెట్టాలంటే పేపర్లు తీసుకుని రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వెళ్లటం ముందే కమీషన్లు తీసుకుని తాడేపల్లి ప్యాలెస్కి వెళ్లాలని సూచించారు. 3 ఏళ్లలో జగన్ రెడ్డి విదేశాల నుంచి తెచ్చిన పెట్టుబడుల కంటే తన విదేశీ పర్యటనలకు చేసిన ఖర్చే ఎక్కువ అన్నారు. టీడీపీ హయాంలో ఒప్పందాలు కుదిరిన పరిశ్రమలకు జగన్ రెడ్డి శంకుస్ధాపనలు చేసి అది తన ఘనతగా ప్రచారం చేసుకోవటం సిగ్గుచేటన్నారు. పరిశ్రమలపై క్రెడిబులిటీ చంద్రబాబుదయితే పబ్లిసిటీ జగన్ రెడ్డిదని ప్రజలే అంటున్నారని పేర్కొన్నారు. వైసీపీ క్యాలెండర్లో ఆగస్టులో ఎంస్.ఈసీలకు పారిశ్రామిక రాయితీలిస్తామన్నారు, కానీ ఇంతవరకు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదన్నారు. 2018 స్టార్టప్ ర్యాంకింగ్స్లో ఏపీ దేశంలోనే మొదటి స్ధానంలో నిలిస్తే 2020-21 లో స్టార్టప్ ర్యాంకింగ్స్లో చిట్టచివరన బీహార్ సరసన చేరిందన్నారు. 3 ఏళ్ల పాలనలో జగన్ రెడ్డి చేసిన తప్పులు, అప్పులతో పాటు నిరుద్యోగం కూడా పెరిగిందన్నారు. జగన్ రెడ్డి 3 ఏళ్లలో రాష్ట్రానికి ఎన్ని పరిశ్రమలు తెచ్చారో ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చారో చెప్పాలని డిమాండ్ చేశారు.