మూడేళ్ల నిరీక్షణ తర్వాత ఉద్యోగయోగం
ABN , First Publish Date - 2021-06-17T06:48:28+05:30 IST
ఎట్టకేలకు మూడేళ్ల నిరీక్షణ ఫలించింది. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న క్షణాలు రానే వచ్చాయి.
డీఎస్సీ 2018 పీఈటీ అభ్యర్థులకు కౌన్సెలింగ్
25 మంది పీఈటీలుగా నియామకం
అనంతపురం విద్య, జూన్ 16: ఎట్టకేలకు మూడేళ్ల నిరీక్షణ ఫలించింది. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న క్షణాలు రానే వచ్చాయి. 2018 డీఎస్సీ పీఈటీ క్వాలిఫైడ్ అభ్యర్థుల్లో 25 మందికి పీఈటీలుగా ఉద్యోగాలు దక్కాయి. 2018 డీఎస్సీ పీ ఈటీ క్వాలిఫైడ్ అభ్యర్థుల్లో మంగళవారం 24 మంది అభ్యర్థులు కాగా, బుధవారం మరొకరు సర్టిఫికెట్ల పరిశీలనకు హాజరయ్యారు. తర్వాత బుధవారం ఉదయం ఆలస్యంగా పోస్టింగ్ కౌన్సెలింగ్ నిర్వహించారు. 29 నోటిఫైడ్ పోస్టుల్లో ఒకటి స్పోర్ట్స్ కోటా మినహా 28 పోస్టులకుగాను 25 మంది అభ్యర్థులకు పోస్టింగ్ కౌన్సెలింగ్ నిర్వహించారు. తర్వాత వారికి నియామక ఉత్తర్వులు జారీ చేశారు. కార్యక్రమంలో ఏడీలు దేవరాజ్, రవూఫ్, సూపరింటెండెంట్ శ్రీనాథ్, ఉద్యోగులు ప్రదీప్, అమర్ పాల్గొన్నారు.
వివాదంపై క్లారిటీ ఇవ్వండి...!
డీఎస్సీలో మెరిట్ ర్యాంకు అభ్యర్థికి ఓపెన్ కోటాలో కాకుండా బీసీ కోటాలో పోస్టు ఇవ్వడంపై వివాదం తలెత్తింది. దీనిపై పీఈటీ, ఉపాధ్యాయ సంఘాలు విన్నవించినా పట్టించుకోకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై సోమవారమే పాఠశాల విద్యాశాఖకు క్లారిఫికేషన్కు రాస్తామన్న అధికారులు ఆ మేరకు చర్యలు తీసుకోకపోవడంపై సంఘాల నాయకులు అసహనం వ్యక్తం చేశారు. దీంతో విద్యాశాఖ అధికారులు.. పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ కార్యాలయాన్ని క్లారిఫికేషన్ కోరారు.