ప్రతిపక్షాలపై అప్రకటిత ఎమర్జెన్సీ

ABN , First Publish Date - 2021-01-22T06:34:17+05:30 IST

రాష్ట్రంలో 20 నెలలుగా భయానక వాతావరణం నెలకొందనీ, ప్రతిపక్షాలపై అ ప్రకటిత ఎమర్జెన్సీని ప్రభుత్వం అమలు చేస్తోందని మాజీ మంత్రి, టీడీపీ పొలిట్‌ బ్యూరో సభ్యుడు కాలవ శ్రీనివాసులు ధ్వజమెత్తారు.

ప్రతిపక్షాలపై అప్రకటిత ఎమర్జెన్సీ
రాయదుర్గంలో నిర్వహించిన నిరసన దీక్షలో పాల్గొన్న మాజీ మంత్రి కాలవ శ్రీనివాసులు

మాజీ మంత్రి కాలవ ధ్వజం

రాయదుర్గం, జనవరి 21: రాష్ట్రంలో 20 నెలలుగా భయానక వాతావరణం నెలకొందనీ, ప్రతిపక్షాలపై అ ప్రకటిత ఎమర్జెన్సీని ప్రభుత్వం అమలు చేస్తోందని మాజీ మంత్రి, టీడీపీ పొలిట్‌ బ్యూరో సభ్యుడు కాలవ శ్రీనివాసులు ధ్వజమెత్తారు. మాజీ మంత్రి కళా వెంకటరావు అరెస్టుకు నిరసనగా గురువారం స్థానిక శాంతినగర్‌లోని ఎన్టీఆర్‌ విగ్ర హం ముందు నిరసన దీక్ష చేపట్టారు. కాలవ మాట్లాడుతూ వ్యవస్థపై నమ్మకం కోల్పోయేలా అధికారులు, మంత్రులు, ముఖ్యమంత్రి ప్రవర్తిస్తుంటే ప్రజలు సహించరన్నారు. చంద్రబాబుతోపాటు కళా వెంకటరావు రామతీర్థాన్ని సందర్శించటం తప్పా.. అని ప్రశ్నించారు. రాముడి విగ్రహ శిరచ్ఛేదనం గావించిన వారిని ఇప్పటివరకు పట్టుకోలేదు కానీ, నేరపూరిత చర్యల్లో ఎక్కడా ప్రమేయంలేని నిష్కలంక నాయకుడైన కళా వెంకటరావును మాత్రం దౌర్జన్యంగా అరెస్టు చేశారన్నారు. ప్రజలు, ప్రజాస్వామ్యం, న్యాయం, ధర్మం, చట్టాలపై బాధ్యత లేకుండా ప్రభుత్వం వ్యవహరిస్తోందన్నారు. ప్రజలను కాపాడుకునేందుకు టీడీపీ ఎలాంటి ఉద్యమానికైనా సిద్ధంగా ఉందన్నారు. ఇప్పటికైనా ముఖ్యమైన అధికారులు ఆత్మవిమర్శ చేసుకోవాలని విన్నవించారు. ప్రభుత్వం ఎన్ని వేధింపులు, ఇబ్బందులు పెట్టినా వెనకడుగు వేసే సమస్యే లేదని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు రాఘవరెడ్డి, పొరాళ్లు పురుషోత్తమ్‌, కాదలూరు మోహన్‌ రెడ్డి, ముదిగల్లు జ్యోతి, టంకశాల హనుమంతు, కడ్డిపూడి మహబూబ్‌బాషా, ప్రశాంతి, దానవేంద్ర, పసుపులేటి రాజు, కాలవ సన్నణ్ణ పాల్గొన్నారు.


జిల్లావ్యాప్తంగా నిరసనలు

అనంతపురం వైద్యం, జనవరి 21: తెలుగుదేశం పార్టీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు, మాజీ మంత్రి కళా వెంకటరావు అరెస్టుకు  నిరసనగా గురువారం జిల్లావ్యాప్తంగా ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆందోళనలు చేపట్టారు. కదిరి, గుంతకల్లు, శింగనమల, రాయదుర్గం, రాప్తాడు, తాడిపత్రి, పెనుకొండ, ధర్మవరం, మడకశిర, కళ్యాణదుర్గం, పుట్టపర్తి, హిందూపురం నియోజకవర్గాల్లో మాజీ ఎమ్మెల్యేలు, ఇన్‌చార్జ్‌లు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పెద్దఎత్తున ఆందోళనలు చేశారు. జిల్లా కేంద్రంలో నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు టవర్‌క్లాక్‌ సమీపంలోని గాంధీ విగ్రహం వద్ద నిరసనకు దిగారు. గంటపాటు అక్కడే బైఠాయించి, ప్రభుత్వం, ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

Updated Date - 2021-01-22T06:34:17+05:30 IST