థర్డ్ వేవ్ను సమష్టిగా ఎదుర్కొందాం
ABN , First Publish Date - 2021-06-17T06:51:07+05:30 IST
కరోనా థర్డ్ వేవ్ను సమష్టిగా ఎదుర్కొందామని జేసీ డాక్టర్ సిరి పిలుపునిచ్చారు. బుధవారం ఆమె జిల్లా సర్వజనాస్పత్రిలో తనిఖీలు చేపట్టారు.
ముందస్తు జాగ్రత్తలు తీసుకుందాం.. ఆస్పత్రి తనిఖీలో జేసీ డాక్టర్ సిరి
అనంతపురం వైద్యం, జూన్ 16: కరోనా థర్డ్ వేవ్ను సమష్టిగా ఎదుర్కొందామని జేసీ డాక్టర్ సిరి పిలుపునిచ్చారు. బుధవారం ఆమె జిల్లా సర్వజనాస్పత్రిలో తనిఖీలు చేపట్టారు. థర్డ్ వేవ్ ప్రభావం పిల్లలపై ఉంటుందని నిపుణులు పేర్కొంటున్న నేపథ్యంలో ఆమె చిన్నపిల్లల విభాగాలను పరిశీలించారు. అక్కడి వసతులు, వైద్య సదుపాయాలు, ముందస్తుగా తీసుకోవాల్సిన చర్యలపై ఆరా తీశారు. ఆక్సిజన్ ప్లాంట్ను పరిశీలించారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ అనంతపురం, హిందూపురం కొవిడ్ ఆస్పత్రుల్లో చిన్నపిల్లల కోసం ప్రత్యేక వార్డులు ఏర్పాటు చేశామన్నారు. ఆ విభాగాల్లో ఆక్సిజన్ బెడ్స్తోపాటు ఇతరత్రా మౌలిక సదుపాయాల కల్పనకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. కొవిడ్ బారిన పడిన వారికి మెరుగైన వైద్యసేవలు అందిస్తామన్నారు. ఈ నేపథ్యంలో ఐదేళ్లలోపు పిల్లలున్న తల్లిదండ్రులకు టీకా పంపిణీలో ప్రాధాన్యత ఇస్తున్నామనీ, ప్రతిఒక్కరూ వేయించుకోవాలన్నారు. కార్యక్రమంలో సూపరింటెండెంట్ డాక్టర్ వెంకటేశ్వరరావు, ఆర్ఎంఓ వైవీ రావు పాల్గొన్నారు.