వీసీ అయినా.. బోధిస్తా..
ABN , First Publish Date - 2021-01-24T07:24:58+05:30 IST
తాను వీసీ బాధ్యతలు చేపట్టినా.. తరగతులు బోధిస్తానని జేఎన్టీయూ నూతన వీసీ జింకా రంగ జనార్దన పేర్కొన్నారు.
జేఎన్టీయూ వీసీ రంగ జనార్దన
బాధ్యతల స్వీకరణ
అనంతపురం అర్బన్, జనవరి 23: తాను వీసీ బాధ్యతలు చేపట్టినా.. తరగతులు బోధిస్తానని జేఎన్టీయూ నూతన వీసీ జింకా రంగ జనార్దన పేర్కొన్నారు. శనివారం వీసీగా ప్రొఫెసర్ రంగ జనార్దన శనివారం వర్సిటీలో బాధ్యతలు స్వీకరించారు. మొదట వీసీ హాలులోని సరస్వతి విగ్రహానికి పూజలు నిర్వహించారు. అనంతరం రిజిస్ర్టార్ విజయకుమార్ ఉత్తర్వుల్లో పేర్కొన్న మేరకు రంగ జనార్దన వీసీగా సంతకం చేశారు. వీసీ మీడియాతో మాట్లాడుతూ ప్రొఫెసర్లు ఏ స్థాయిలోవున్నా విద్యాభోధన మరవకూడదన్నారు. విద్యార్థులకు పాఠాలు చెబుతూనే ఉండాలన్నారు. ఉన్నత విద్యామండలి నూతనంగా ప్రవేశపెట్టిన మల్టీ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ యూనివర్సిటీ (మీరు)గా జేఎన్టీయూ ఎంపికైందన్నారు. ఈ ప్రాజెక్ట్ను విజయవంతం చేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. జాతీయ విద్యావిధానాన్ని అమలు చేస్తామన్నారు. విద్యార్థులకు మెరుగైన విద్యను అందించేందుకు అకడమిక్ విభాగాన్ని బలోపేతం చేస్తామన్నారు. వర్సిటీ అభివృద్ధికి కృషి చేస్తామన్నారు.
వెల్లువెత్తిన శుభాకాంక్షలు
నూతన వీసీగా బాధ్యతలు తీసుకున్న రంగ జనార్దనకు శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. ఏఎ్సడీ టు వీసీ యోహాన్, వర్సిటీ అధికారులు శశిధర్, సత్యనారాయణ, గిరిప్రసాద్, భానుమూర్తి, సుమలత, శోభాబిందు, భవాని, అరుణ, వసుంధర, దుర్గాప్రసాద్, జోజిరెడ్డి, డీఆర్లు, ఏఆర్లు, ఓటీఆర్ఐ డైరెక్టర్ దేవన్న, ఏఆర్ లింగప్ప, ఇంజనీరింగ్ కళాశాల బోధన, బోధనేతర సిబ్బంది.. వీసీకి పుష్పగుచ్ఛాలు అందజేసి, శుభాకాంక్షలు తెలిపారు. పీహెచ్డీ విద్యార్థులు జనార్దనరాజు, నందకుమార్, శ్రీనివా్సరెడ్డి సన్మానించారు.
ఆర్ఈఎఫ్ ఆధ్వర్యంలో..
రిజర్వేషన్ ఉద్యోగుల సమాఖ్య (ఆర్ఈఎఫ్) ఆధ్వర్యంలో నూతన వీసీని ఘనంగా సత్కరించారు. ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ రామచంద్ర, ఉపాధ్యక్షుడు ఎండీ నాగభూషణ, రామకృష్ణ, ఎస్సీ, ఎస్టీ జేఏసీ అధ్యక్షుడు సాకే హరి, ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షుడు అక్కులప్ప, పుష్పలత, బీసీ లక్ష్మణ్, జెన్నే ఆనంద్ పుష్పగుచ్ఛాలను అందజేశారు. జేఎన్టీయూ బోధనేతర ఉద్యోగుల సంఘం నాయకులు పుష్పగుచ్చంతో శుభాకాంక్షలు తెలిపారు. తమ సమస్యలు పరిష్కరించాలని సంఘం అధ్యక్షుడు జయకృష్ణ, కార్యదర్శి నాగరాజు, ఉపాధ్యక్షుడు ఓబులేసు, సంయుక్త కార్యదర్శి బీఎండీ అన్సార్, ట్రెజరర్ పెద్దన్న, కరస్పాండెంట్ వెంకటరాముడు పాల్గొన్నారు.